టీమిండియా చరిత్రలో లెజెండ్లుగా చెప్పుకునే ప్లేయర్లలో ఎంఎస్ ధోనీ ఒకడు. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అన్నీ అందుకున్న ఏకైక కెప్టెన్ ఇతనే. అయితే అంతకన్నా ముందు ధోనీ విధ్వంసకర బ్యాటర్. ఇదే విషయాన్ని మాజీ లెజెండ్ గౌతం గంభీర్ గుర్తుచేశాడు.
గతంలో వరల్డ్ కప్ విజయం గురించి మాట్లాడుతూ.. తమ టీం అంతా కలిసి వరల్డ్ కప్ నెగ్గితే క్రెడిట్ మాత్రం అంతా ధోనీకి పోయిందని గంభీర్ అన్న సంగతి తెలిసిందే. యువరాజ్ సింగ్ వంటి వాళ్లు పోషించిన పాత్రకు గుర్తింపు దక్కలేదని గంభీర్ అక్కసు వెళ్లగక్కాడు. అప్పటి నుంచి గంభీర్, ధోనీ మధ్య ఏదో గొడవ ఉందని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.

అలాంటిది ఇప్పుడు గంభీర్ చేసిన కామెంట్స్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఏ జట్టులో అయినా ధోనీ ఉండటం ఒక వరం అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 'భారత్కు దొరికిన వికెట్ కీపర్లలో బ్యాటుతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగిన మొట్టమొదటి కీపర్ ధోనీనే. అంతకుముందు ఉన్న వాళ్లు ముందు కీపర్లు, ఆ తర్వాతే బ్యాటర్లు. కానీ ధోనీ ముందు బ్యాటర్, ఆ తర్వాతే కీపర్' అని గౌతీ చెప్పాడు.
'ఏడో నెంబర్లో వచ్చి కూడా మ్యాచులు గెలిపించగల ఎంఎస్ ధోనీ వంటి వికెట్ కీపర్ బ్యాటర్ దొరకడం నిజంగా భారత క్రికెట్ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే తన దగ్గర అంత పవర్ గేమ్ ఉంది' అని గంభీర్ చెప్పుకొచ్చాడు. వన్డే కెరీర్లో ధోనీ 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలతో 10,773 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు.
కెరీర్ ఆరంభంలో ధోనీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. దీన్ని గుర్తుచేసిన గంభీర్.. 'ధోనీ కనుక మూడో నెంబర్లోనే బ్యాటింగ్ చేసి ఉంటే ఎన్నో వన్డే రికార్డులు బద్దలు కొట్టేవాడు' అన్నాడు. కెప్టెన్గా ధోనీ సాధించిన విజయాల గురించి అందరూ మాట్లాడతారని, అది నిజమే అయినా సరే కెప్టెన్సీ వల్ల ధోనీ తనలోని బ్యాటర్ను త్యాగం చేశాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
'బ్యాటింగ్ త్యాగం చేయకపోయి ఉంటే ధోనీ మరెన్నో రికార్డులు సృష్టించేవాడు. కెప్టెన్ అయితే ఇదే జరుగుతుంది. ఎందుకంటే కెప్టెన్ తన కన్నా టీం కోసం ముందు ఆలోచించాలి. అప్పుడు మన గురించి మనం మర్చిపోతాం. ధోనీ 6-7 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. కానీ తను కెప్టెన్ కాకపోయి ఉంటే ధోనీనే టీమిండియా నెంబర్ త్రీ' అని గంభీర్ చెప్పాడు.
'ధోనీ కనుక మూడో నెంబర్లో కొనసాగి ఉంటే ఇంకా ఎన్నో పరుగులు చేసేవాడు. అలాగే ఇంకా ఎన్నో సెంచరీలు కూడా చేసేవాడు. ఫ్యాన్స్ అంతా ధోనీని ట్రోఫీలతో చూస్తారు. కానీ నా వరకైతే జట్టు ట్రోఫీల కోసం ధోనీ తన అంతర్జాతీయ పరుగులను త్యాగం చేశాడు' అని గంభీర్ పేర్కొన్నాడు.
ఈ మాటలు విన్న ఫ్యాన్స్ చాలామంది.. ముఖ్యంగా ధోనీ బ్యాటింగ్ విన్యాసాలు చూసిన వాళ్లు నిజమే అంటున్నారు. ధోనీ కనుక మూడో నెంబర్లో కొనసాగి ఉంటే, కోహ్లీ వచ్చే వరకు ఎన్నో రికార్డులు ఉండేవి కావని ఫ్యాన్స్ అంటున్నారు. అసలు కోహ్లీకి మూడో నెంబర్లో ఆడే ఛాన్స్ కూడా దక్కేది కాదని, సచిన్ రికార్డుల వెంట ధోనీ పరిగెత్తేవాడని చెప్పుకుంటున్నారు.