క్రికెట్లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో మ్యాచ్లో వార్నర్ అవుటైన తీరు వివాదాస్పదమైన నేపథ్యంలో అంపైర్ల తీరును వార్నర్ తప్పుబట్టాడు. అంపైర్ల కెరీర్లో తీసుకున్న సరైన, తప్పుడు నిర్ణయాల లెక్కలను కూడా బిగ్ స్క్రీన్పై చూపించాలని డిమాండ్ చేశాడు.
ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్తో పాటు స్టీవ్ స్మిత్ ఎల్బీడబ్ల్యూ అయిన తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మధుశంక వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో వార్నర్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అయితే ఫీల్డ్ అంపైర్ డెసిషన్పై వార్నర్ థర్డ్ అంపైర్కు వెళ్లినా డీఆర్ఎస్లో అంపైర్స్ కాల్ వచ్చింది. దీంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్నే ఫైనల్ చేస్తూ థర్డ్ అంపైర్ కూడా వార్నర్ను అవుట్గా ప్రకటించాడు. దీనిపై వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు.

వార్నర్ మాత్రమే కాదు.. అదే ఓవర్ ఆఖరి బంతికి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఇదే తరహాలో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. స్మిత్ కూడా ఫీల్డ్ అంపైర్ డెసిషన్ను ఛాలెంజ్ చేయగా.. డీఆర్ఎస్లో అంపైర్స్ కాల్ అని వచ్చింది. ఈ అవుట్ కూడా వివాదాస్పదమవుతోంది.
ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన వార్నర్.. ఎలాగైతే బ్యాటర్లు, బౌలర్ల గణాంకాలను బిగ్ స్క్రీన్పై చూపిస్తారో, అదే తరహాలో అంపైర్ల సరైన, తప్పుడు నిర్ణయాలకు సంబంధించిన గణాంకాలను కూడా పెద్ద తెరపై చూడాలనుకుంటున్నానన్నాడు.
'బంతి నా ప్యాడ్లను లెగ్ సైడ్ తాకి వెళుతోందంటే అది కచ్చితంగా వికెట్లకు తాకదని అర్థం. అందుకే నేను అంత అసహనానికి గురయ్యాను. వెంటనే అంపైర్ జోయెల్ని కూడా బంతి బయట వైపు వెళుతుంటే అవుట్ ఎలా ఇచ్చావని అడిగాను. దానికి అతడు బంతి స్వింగ్ అవుతోందని, అందుకే అవుట్ ఇచ్చానన్నాడు. కానీ రీప్లేలో బంతి స్వింగ్ అవుతున్నట్లు కనిపించలేదు. అందుకే నాకు ఇబ్బందిగా అనిపించింది' అని వార్నర్ చెప్పుకొచ్చాడు.