వరల్డ్ కప్లో తమ రెండో మ్యాచులోనే పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఏకంగా 344 పరుగుల భారీ స్కోరును ఛేదించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక అదరగొట్టింది. కుశాల్ మెండిస్ (122), సదీర సమరవిక్రమ (106) సెంచరీలతో చెలరేగారు. దీంతో ఆ జట్టు 344 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇంత భారీ స్కోరును పాకిస్తాన్ ఛేజ్ చేయడం దాదాపు అసాధ్యమే అని అంతా అనుకున్నారు. దానికితోడు ఇమామ్ ఉల్ హక్ (12), బాబర్ ఆజమ్ (10) దారుణంగా విఫలమయ్యారు. దీంతో పాకిస్తాన్ పని అయిపోయిందని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటి సమయంలో మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (108), మహమ్మద్ రిజ్వాన్ (121 నాటౌట్) అద్భుతమైన పోరాటం కనబరిచారు.

వీళ్లిద్దరూ కలిసి 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో పాకిస్తాన్ గెలుపు వైపు అడుగులు వేసింది. చివర్లో సౌద్ షకీల్ (31), ఇఫ్తికర్ అహ్మద్ (22 నాటౌట్)తో కలిసి రిజ్వాన్ ఈ లాంఛనం కూడా పూర్తి చేశాడు. దీంతో పాకిస్తాన్ మరో పది బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద ఛేజ్ కావడం గమనార్హం.
ఇంత భారీ స్కోరు చేసి కూడా ఓడిపోవడంపై శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక నిరాశ వ్యక్తం చేశాడు. అదే సమయంలో తమ టీం బ్యాటింగ్ను మెచ్చుకున్నాడు. ముఖ్యంగా ధనాధన్ ఆటతో అలరించిన కుశాల్ మెండిస్ను ఆకాశానికి ఎత్తేశాడు. 'మెండిస్ ప్రస్తుతం అదిరే ఫామ్లో ఉన్నాడు. సదీర కూడా అద్భుతంగా ఆడుతున్నాడు' అని షనక కొనియాడాడు.
'వీళ్లిద్దరూ రాణించినా చివర్లో ఇంకా మెరుగ్గా మా ఆటను ముగించాల్సింది. వికెట్ను బట్టి చూస్తే మేం మరో 20-25 పరుగులు తక్కువ చేశాం. పాక్ బౌలర్లు చివర్లో మంచి స్లోబాల్స్ వేశారు. మా బౌలర్ల నుంచి నేను మరీ ఎక్కువ ఆశించడం లేదు. చాలా సింపుల్ ప్లాన్స్ అమలు చేశాం. కానీ మరీ ఎక్కువ ఎక్స్ట్రాలు ఇచ్చాం. బౌలర్లను ఎంకరేజ్ చేసే ఏకైక అవకాశం గెలవడం. కానీ దురదృష్టవశాత్తూ ఆ ఛాన్స్ కూడా కోల్పోయాం' అని షనక చెప్పుకొచ్చాడు.