వరల్డ్ కప్లో భారత జట్టు తమ ప్రయాణం మొదలు పెట్టేందుకు రెడీ అయింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు ఈ టీం రెడీ అయింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్కు వరుణుడు ముప్పు ఉందా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే శనివారం నాడు చెన్నైలో బాగా వర్షం పడింది.
ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం వెల్లడించాడు. 'ఇక్కడ భారీగా వర్షం పడుతోంది. మరి మ్యాచ్ రోజు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉంది' అని ట్వీట్ చేశాడీ కామెంటేటర్. అయితే ఆదివారం చెన్నైలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తోంది.

గత రెండ్రోజుల నుంచి చెన్నైలో సడెన్గా మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయితే మ్యాచ్ సమయంలో మాత్రం వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఒకవేళ వర్షం పడినా కూడా మ్యాచ్ రద్దయ్యేంత భారీ వర్షం పడదని, కేవలం ఆటకు మధ్య మధ్యలో అంతరాయం మాత్రమే కలుగుతుందని కొందరు చెప్తున్నారు.
దీంతో మహా అయితే ఓవర్లు కుదిస్తారని, కానీ మ్యాచ్ అయితే కచ్చితంగా జరుగుతుందని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక చెపాక్ స్టేడియం స్పిన్కు పెట్టింది పేరని అందరికీ తెలిసిందే. దీంతో ఈ మ్యాచులో అశ్విన్, కుల్దీప్ ఇద్దరూ కచ్చితంగా ఆడతారని తెలుస్తోంది.

ఈ క్రమంలో శార్దూల్ ఠాకూర్ను పక్కన పెట్టేస్తారని సమాచారం. అలాగే డెంగ్యూతో బాధ పడుతున్న గిల్ కోలుకున్నా కూడా నీరసంతో ఆడటం కష్టమని తెలుస్తోంది. కాబట్టి ఈ మ్యాచులో రోహిత్కు జోడీగా ఇషాన్ కిషన్ దిగే అవకాశం ఉంది. లేదంటే కోహ్లీతో ఓపెనింగ్ చేయించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్