INDvsENG: వరల్డ్ కప్లో అత్యంత కీలకపోరుకు సిద్ధమవుతోంది టీమిండియా. టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్.. ఇప్పుడు డిఫెడింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో తలపడబోతోంది. అయితే ప్రస్తుతం పేలవ ఫాంతో బాధపడుతున్న ఇంగ్లండ్ను పటిష్ఠ భారత్ సునాయాసంగా ఓడించేలా కనిపిస్తోంది. కానీ 2019లో సరిగ్గా ఇలాగే జరిగింది. అప్పటివరకు వరుస ఓటములతో అల్లాడిపోతున్న ఇంగ్లండ్.. ఓటమనేదే లేకుండా దూసుకుపోతున్న భారత్ను ఓడించి భారీ షాకిచ్చింది.
2019 వరల్డ్ కప్లో ఇండియా వరుసగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, విండీస్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లను సునాయాసంగా ఓడించిన టీమిండియా వరుసగా 5 విజయాలతో నిలిచింది. ఇక న్యూజిల్యాండ్తో మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయింది. టోర్నీలో భారత్ తన 7వ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడింది. అప్పటికి ఇంగ్లండ్.. 7 మ్యాచ్లు ఆడి అందులో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్లపై గెలిచింది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక చేతిలో ఓడింది. ముఖ్యంగా భారత్తో మ్యాచ్ ముందు శ్రీలంక, ఆస్ట్రేలియా చేతిలో వరుస మ్యాచ్లలో ఓడి గెలుపు కోసం తంటాలు పడుతోంది. అలాంటి టైంలో భారత్ను ఓడించి తిరిగి ఫాం సంపాదించుకుంది.

ఇండియా vs ఇంగ్లండ్ 2019 మ్యాచ్:
ఇండియా vs ఇంగ్లండ్ 2019 వరల్డ్ కప్ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్లకు 337 రన్స్ చేసింది. ఇంగ్లీష్ బ్యాటింగ్లో బెయిర్ స్టో (111) సెంచరీతో చెలరేగగా.. జేసన్ రాయ్ (66), బెన్ స్టోక్స్ (79) అర్థసెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమి 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు.
ఇక భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (102) సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ (66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. కానీ పాండ్యా (45), ధోనీ (42), పంత్ (32) ఆశించినంతగా రాణించకపోవడంతో మ్యాచ్ గెలవడంలో వెనుకబడిపోయాం. ఇంగ్లీష్ బౌలర్లలో ప్లంకెట్ 3, వోక్స్ 2 వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది.
సరిగ్గా ఇప్పటి టీంలానే ఆ మ్యాచ్లో కూడా ఇంగ్లండ్ జట్టు పెద్దగా ఫాంలో ఏం లేదు. బౌలర్లు అంతంత మాత్రంగానే బౌలింగ్ చేశారు. టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (0), నాలుగో ప్లేస్లో పంత్ (32) పేలవ ప్రదర్శన చేయడంతోనే భారత్ ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పొచ్చు. ఈ రెండు స్థానాలు ఏ జట్టుకైనా చాలా ఇంపార్టెంట్. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఓపెనర్ ప్లేస్లో గిల్ బరిలోకి దిగుతున్నాడు.
గిల్ ఫుల్ ఫాంలో ఉండడం భారత్కు బాగా కలిసొచ్చే అంశం. అయితే నాలుగో ప్లేస్లో అయ్యర్ ఫాం కొద్దిగా ఆందోళన కలిగిస్తోంది. ఈ టోర్నీలో అయ్యర్ పెద్దగా రాణించిందేమీ లేదు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో అయ్యర్.. 0, 25*, 53*, 19, 33 స్కోర్లు మాత్రమే చేశాడు. దీంతో ఈ ప్లేస్ కొద్దిగా ఆందోళనకరంగా ఉంది. అంటే ఈ మ్యాచ్లో అయ్యర్ కచ్చితంగా రాణించాలన్నమాట.
ఇక బౌలింగ్ విషయానికొస్తే.. టీమిండియా బౌలర్లలో ప్రస్తుతం అందరూ ఫుల్ ఫాంలో ఉండడం కలిసొచ్చే అంశం. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో టీమిండియా సమతూకంగా ఉంది. ఐదుగురు బౌలర్లూ ఫుల్ ఫాంలో ఉన్నారు. ముఖ్యంగా గత సీజన్లో ఇంగ్లండ్ నడ్డి విరిచిన షమి.. గత మ్యాచ్లోనే జట్టులోకొచ్చి న్యూజిల్యాండ్పై 5 వికెట్లతో అదరగొట్టాడు. ఇక బుమ్రా ఇప్పటికే టోర్నీలో భారత్ తరపున 11 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు. రోహిత్, కోహ్లీ కూడా అదరగొడుతున్నారు.
ఒకవేళ ఇంగ్లీష్ బ్యాటర్లను కనుక తక్కువ స్కోరుకు అవుట్ చేయగలిగితే.. ముఖ్యంగా జాస్ బట్లర్, బెయిర్ స్టో, స్టోక్స్ వీళ్లు ముగ్గురినీ త్వరగా అవుట్ చేయగలిగితే టీమిండియా కచ్చితంగా విజయం దక్కించుకోగలుగుతుంది.