ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న బ్యాటర్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం అసాధ్యమని పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ అన్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 కోసం భారత్కు చేరుకున్న పాక్ జట్టు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు వైస్ కెప్టెన్ షాదద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఒకవేళ రోహిత్ కనుక క్రీజులో సెట్ అయితే అతడిని అడ్డుకోవడం అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్పుకొచ్చాడు. రోహిత్ ఫామ్లో ఉంటే అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టమని, అతి ఫామ్ను బట్టే తమ బౌలింగ్ స్టైల్స్ను మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే మ్యాచ్ మొదలైన తర్వాత ఏ క్షణంలోనైనా ఈ లెక్కలన్నీ మారిపోయే అవకాశం ఉందన్నాడు.

''ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఆడుతున్న లీడ్ బ్యాటర్స్లో నాకు రోహిత్ అంటే చాలా ఇష్టం. రోహిత్కు బౌలింగ్ చేయడం కూడా చాలా కష్టమే. రోహిత్ ఫామ్లో ఉన్నాడంటే బౌలర్ ఎన్ని వేరియేషన్స్ వేసినా బంతిని బౌండ్రీకి పంపిస్తాడు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ నా ఫేవరెట్. అతడి బౌలింగ్ను ఆడటమే కాదు అంచనా వేయడం కూడా కష్టమే' అని షాదాబ్ అన్నాడు.
భారత్తో తలపడే ప్రతి జట్టుకు కుల్దీబ్ పెద్ద ఛాలెంజ్ అవుతాడుని షాదాబ్ అభిప్రాయపడ్డాడు. అలాగే తమకు హైదరాబాద్లో దక్కిన ఆతిథ్యాన్ని కూడా మెచ్చుకున్నాడు. గత ఏడేళ్లలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ భారత్కు రావడం ఇదే తొలిసారి. దీంతో వారు ప్రస్తుతం ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలి వార్మప్ మ్యాచ్లో న్యూజిలాండ్తో చేతిలో పాక్ ఐదు వికెట్ల తేడాతో చిత్తయింది. ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం వీళ్లు రెడీ అవుతున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ ఆతిథ్యం గురించి మాట్లాడుతూ.. ''హైదరాబాద్ అతిథ్యం అదిరిపోయింది. ఇక్కడి ఫుడ్ తలచుకుంటేనే నోరూరేలా ఉంది. అధికారులు, ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సాదరంగా ఆహ్వానించారు. అహ్మదాబాద్లో భారత్తో తలపడేటప్పుడు కూడా ఇదే తరహా ఆతిథ్యం లభిస్తుందని భావిస్తున్నా. మరి అప్పుడేం జరుగుతుందో చూద్దాం'' అని నవ్వేశాడు. హైదరాబాద్లో లభించిన వెల్కం కూడా చాలా బాగుందన్న అతను.. కరాచీ, లాహోర్లో టీంకు దొరికే వెల్కంను గుర్తుచేశాయని అన్నాడు.