ఈ వరల్డ్ కప్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్కు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ టికెట్లు దొరక్క బాధ పడుతున్న వారందరికీ కొత్త ఊపిరి ఊదింది. భారత్, పాక్ మ్యాచ్ కోసం మరో 14 వేల టికెట్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ నెల 14వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, పాక్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టికెట్లు కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన గంటలోనే అన్నీ అమ్ముడుపోయాయి. చాలా మంది ఫ్యాన్స్కు కనీసం టికెట్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా దక్కలేదు.

ఈ క్రమంలో నెట్టింట ఈ విషయంపై ఫ్యాన్స్ అందరూ అక్కసు వెళ్లగక్కారు. టికెట్ల అమ్మకం పెద్ద స్కామ్లా ఉందంటూ బీసీసీఐపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకొని, నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్కు సంబంధించి మరో 14 వేల టికెట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ స్టేడియంలో ఒక లక్షా 32 వేల మంది ప్రేక్షకులు కూర్చొనే వీలుంటుంది. ఈ మ్యాచ్ సమయంలో ఈ సీట్లన్నీ ఫుల్ అయిపోతాయని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
'అందరూ ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు సంబంధించి మరో 14 వేల టికెట్లు విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటిస్తోంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకం అక్టోబర్ 8వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది' అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదే వేదికలో వరల్డ్ కప్ ఓపెనింగ్ గేమ్ జరిగింది. న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ తలపడిన ఈ మ్యాచులో డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర శతకాలతో చెలరేగడంతో కివీస్ ఘనవిజయం సాధించింది. నవంబరు 19న వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది.