భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. స్వదేశంలో జరిగే ఈ మెగాటోర్నీలో భారత జట్టు కూడా ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది. అదే సమయంలో దాయాది దేశం పాకిస్తాన్ కూడా ఒక ఫేవరెట్గా ఉంది. ఈ క్రమంలోనే ఈ రెండు జట్లు కనుక సెమీస్ చేరితే.. ఈ మ్యాచ్ను ముంబైలో పెట్టరట. ఎందుకంటే అక్కడ తమకు భద్రతా సమస్యలు ఉన్నాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంటోంది.
ముంబైలో సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయని పీసీబీ చెప్పినా కూడా.. మొదటి సెమీఫైనల్ను ముంబైలో నిర్వహించాలని బీసీసీఐ డిసైడ్ అయింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఈ క్రమంలోనే ఒక సమస్య వచ్చింది. వరల్డ్ కప్లో గ్రూప్ దశలో జరిగే మ్యాచుల్లో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు టేబుల్ టాపర్గా నిలుస్తుంది. ఇలా మొదటి స్థానంలో నిలిచిన జట్టు.. నాలుగో స్థానంలోని జట్టుతో మొదటి సెమీస్ ఆడుతుంది.

అంటే ఒకవేళ భారత్ కనుక టేబుల్ టాపర్గా నిలిచి, పాక్ నాలుగో నెంబర్లో లీగ్ ముగిస్తే.. ఈ రెండు జట్లు ముంబైలో ఆడాల్సి వస్తుంది. కానీ అక్కడ తమకు భద్రతా సమస్యలు ఉన్నాయని పాక్ చెప్తోంది. కాబట్టి ఈ సెమీఫైనల్ మ్యాచ్ వేదిక మార్చేస్తారట. అంటే.. ఒకవేళ భారత్, పాక్ తొలి సెమీస్ ఆడాల్సి వస్తే.. ఆ మ్యాచ్ను కోల్కతాలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందట.
మరో సెమీస్ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. ఈ మెగాటోర్నీకి ముందు కొన్ని జట్లు వార్మప్ మ్యాచ్లు కూడా ఆడతాయి. సెప్టెంబరు 29 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే ఈ మ్యాచులు గువాహతి, తిరువనంతపురం, హైదరాబాద్ వేదికలుగా జరగనున్నాయి. మొత్తం పది జట్లు పాల్గొనే ఈ లీగ్ కోసం బీసీసీఐ పది వేదికలను సెలెక్ట్ చేసింది. ఈ క్రమంలో మొహాలీ, ఇండోర్, రాజ్కోట్ వంటి వేదికలను వదిలేసింది. దీనిపై ఇప్పటికే ఆయా క్రికెట్ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.