వరల్డ్ కప్లో 'నాగిన్ డ్యాన్స్' చేసే ఛాన్స్ బంగ్లాదేశ్కు దక్కింది. శ్రీలంకపై ఈ టీం మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆశించిన స్కోరు చేయలేకపోయింది. ఆ టీం కీలక ప్లేయర్లు కుశాల్ పెరీరా (4), కుశాల్ మెండిస్ (19) విఫలమయ్యారు. అయితే యువ ఓపెనర్ పాథుమ్ నిస్సంక (41) పోరాడాడు.
ఆ తర్వాత వచ్చిన చరిత్ ఆసలంక (108) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. సదీర సమరవిక్రమ (41), ధనంజయ డి సిల్వ (34), మహీష్ తీక్షణ (21) కూడా ఫర్వాలేదనిపించారు. అయితే వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ (0) కనీసం ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే టైమ్ అవుట్గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అతను క్రీజులోకి వచ్చిన తర్వాత హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది.

దీంతో అతను నిర్ణీత సమయంలోగా ఆట మొదలు పెట్టలేకపోయాడు. ఇది గుర్తించిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్.. అవుట్ కోసం అప్పీల్ చేశాడు. చేసేదేమీ లేక మాథ్యూస్ను అంపైర్లు టైమ్ అవుట్గా ప్రకటించారు. దీంతో ఈ మ్యాచులో హీట్ పెరిగింది. శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయింది.
ఛేజింగ్లో షకీబల్ హసన్ (82), నజ్ముల్ హసన్ షాంటో (90) రాణించడంతో బంగ్లా టీం విజయం సాధించింది. ఈ జట్టు 41.1 ఓవర్లలోనే 282 పరుగులు చేసి విజయం తమ ఖాతాలో వేసుకుంది. ఈ విజయంపై బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ సంతోషం వ్యక్తం చేశాడు. 'టాస్ గెలిచినప్పుడు ముందు బౌలింగ్ ఎంచుకోవడంలో నేను ఏమాత్రం తడబడలేదు. ఎందుకంటే మేం ఇక్కడ మంచులో ట్రైనింగ్ చేశాం' అని చెప్పాడు.
'మేం సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండటం ముఖ్యం. అదృష్టం కొద్దీ మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. షాంటో, నేను మా ఆటతీరుకు సరిపోయేలా ఆడాం. కొంచెం ముందే మ్యాచ్ ముగించేయాల్సింది. కానీ గెలుపు గెలుపే కదా' అని షకీబల్ అన్నాడు. అదే సమయంలో మాథ్యూస్ అవుట్ గురించి కూడా మాట్లాడాడు. అసలు తనకు ఆ విషయమే తెలియదన్నాడు.
'మా ఫీల్డర్లలో ఒకరు వచ్చి మేం అప్పీల్ చేస్తే మాథ్యూస్ అవుట్ అవుతాడని చెప్పాడు. అందుకే అప్పీల్ చేశా. అంపైర్లు కూడా నేను సీరియస్గా అప్పీల్ చేస్తున్నానా? అని అడిగారు. అది రూల్స్లో ఉంది. అది కరెక్టో కాదో నాకు తెలీదు. నాకైతే ఒక యుద్ధంలో ఉన్నానన్న ఫీలింగ్ ఉంది. అందుకే గెలవడానికి ఏం చేయాలో అవన్నీ చేశా. దీనిపై ఇప్పుడు పెద్ద చర్చలు జరుగుతాయి. ఈ రోజు ఆ టైమ్ అవుట్ కూడా మాకు కలిసొచ్చింది. దాన్ని నేను ఒప్పుకుంటా' అని స్పష్టం చేశా.