వరల్డ్ కప్లో 'నాగిన్ డ్యాన్స్' చేసే ఛాన్స్ బంగ్లాదేశ్కు దక్కింది. శ్రీలంకపై ఈ టీం మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆశించిన స్కోరు చేయలేకపోయింది. ఆ టీం కీలక ప్లేయర్లు కుశాల్ పెరీరా (4), కుశాల్ మెండిస్ (19) విఫలమయ్యారు. అయితే యువ ఓపెనర్ పాథుమ్ నిస్సంక (41) పోరాడాడు.
ఆ తర్వాత వచ్చిన చరిత్ ఆసలంక (108) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. సదీర సమరవిక్రమ (41), ధనంజయ డి సిల్వ (34), మహీష్ తీక్షణ (21) కూడా ఫర్వాలేదనిపించారు. అయితే వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ (0) కనీసం ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే టైమ్ అవుట్గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అతను క్రీజులోకి వచ్చిన తర్వాత హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది.

దీంతో అతను నిర్ణీత సమయంలోగా ఆట మొదలు పెట్టలేకపోయాడు. ఇది గుర్తించిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్.. అవుట్ కోసం అప్పీల్ చేశాడు. చేసేదేమీ లేక మాథ్యూస్ను అంపైర్లు టైమ్ అవుట్గా ప్రకటించారు. దీంతో ఈ మ్యాచులో హీట్ పెరిగింది. శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయింది.
ఛేజింగ్లో షకీబల్ హసన్ (82), నజ్ముల్ హసన్ షాంటో (90) రాణించడంతో బంగ్లా టీం విజయం సాధించింది. ఈ జట్టు 41.1 ఓవర్లలోనే 282 పరుగులు చేసి విజయం తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమిపై లంక కెప్టెన్ మెండిస్ స్పందించాడు. 'చరిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మేం ఒక 30-40 పరుగులు తక్కువ చేశాం. ఇక్కడ 320 చేసి ఉంటే గెలిచేవాళ్లం' అన్నాడు.
'భవిష్యత్తులో మా టీం బలంగా ఉంటుందని నమ్ముతున్నా. కొంత మంది కీలక ప్లేయర్లకు గాయాలయ్యాయి. అందుకే టీంలో చాలా మార్పులు చేసి, కొత్త వాళ్లను తీసుకోవాల్సి వచ్చింది. అదే టైంలో కొన్ని మిస్టేక్స్ కూడా చేశాం. మేం మెరుగైన క్రికెట్ ఆడి ఉంటే టాప్-4లో ఉండేవాళ్లం' అన్నాడు. మాథ్యూస్ టైమ్ అవుట్పై కూడా స్పందించిన కుశాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
'మాథ్యూస్ క్రీజులోకి వచ్చినప్పుడు ఇంకా ఐదు సెకన్ల టైం ఉంది. కానీ క్రీజులోకి వచ్చిన తర్వాతనే ఆ స్ట్రాప్ తెగిపోయింది చూశాడు. అది చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. తను మంచి పరుగులు చేస్తాడని అనుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అంపైర్లు సరైన నిర్ణయం తీసుకోకపోవడం నిజంగా బాధాకరం' అని చెప్పుకొచ్చాడు.