భారత్ చేతిలో ఘోరంగా ఓడిన తర్వాత మరో కీలక పోరుకు పాకిస్తాన్ రెడీ అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు పాకిస్తాన్ రెడీ అయింది. ఈ టోర్నీని వరుస పరాజయాలతో ప్రారంభించిన ఆస్ట్రేలియా.. తాజాగా శ్రీలంకను ఓడించి గెలుపు రుచి చూసిన సంగతి తెలిసిందే. అదే జోరులో పాక్ను కూడా ఓడించాలని ఆసీస్ ఆశ పడుతోంది.
అదే సమయంలో భారత్ చేతిలో పరాజయం తర్వాత విమర్శలపాలైన పాకిస్తాన్ కూడా ఈ మ్యాచులో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది. ఇక చిన్నస్వామి స్టేడియం పిచ్ చాలా గట్టిగా కనిపిస్తోందని, ఆరంభంలో పేసర్లకు అనుకూలించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ పిచ్పై స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేరని, వాళ్లు చాలా తెలివిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ మ్యాచులో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పిచ్ చాలా బాగుందని, ఎర్లీ వికెట్స్ తీసుకొని ఆసీస్పై ఒత్తిడి పెంచడమే తమ ప్లాన్ అని బాబర్ ఆజమ్ చెప్పాడు. తమ జట్టులో ఒకే ఒక మార్పు చేశామన్నాడు. షాదాబ్ ఖాన్ స్థానంలో ఉసామా మిర్ ఆడుతున్నట్లు వెల్లడించాడు. కొత్త కొత్త కాంబినేషన్లు ట్రై చేస్తున్నామని, ఏది సక్సెస్ అవుతుందో చూస్తున్నామని అన్నాడు.
తాను టాస్ గెలిచినా ముందుగా బౌలింగే ఎంచుకునే వాడినని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అయితే ముందుగా బ్యాటింగ్ చేయడానికి కూడా తమకేం ఇబ్బంది లేదన్నాడు. వికెట్ చాలా బాగుందని, శ్రీలంకపై ఆడిన విధానం తమలో ఎనర్జీ నింపిందని అన్నాడు. ఆ మ్యాచులో తమ బ్యాటింగ్ ఇంటెంట్ చాలా బాగుందని, అదే ఇక్కడ కూడా కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవన్నాడు.