ఆఫ్ఘనిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిన తర్వాత పాకిస్తాన్ జట్టుపై, ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్పై విపరీతంగా విమర్శలొస్తున్నాయి. పాక్ జట్టు మాజీలు సైతం బాబర్పై మండిపడుతున్నారు. అయితే ఆ జట్టు మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ మాత్రం బాబర్కు అండగా నిలిచాడు. పాకిస్తాన్ ఓటమికి బాబర్ ఒక్కడే కారణం కాదంటూ అతడికి మద్దతు ప్రకటించాడు.
ఓ పాకిస్తానీ టీవీ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూసుఫ్ మాట్లాడుతూ.. "ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిన తర్వాత బాబర్ డ్రెస్సింగ్ రూంలో ఏడ్చాడనే విషయం నాకు తెలిసింది. వెంటనే చాలా బాధ కలిగింది. జట్టు ఓటమికి ఎప్పుడూ కెప్టెన్ మాత్రమే ఏకైక బాధ్యుడు కాదు. మొత్తం జట్టు, టీం మేనేజ్మెంట్కి కూడా అందులో భాగం ఉంటుంది. నేను బాబర్ తరపున ఉన్నా.. నేనే కాదు.. మొత్తం దేశం బాబర్కు అండగా నిలుస్తుంది" అన్నాడు.

కాగా.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పాక్ ఓటమిపై పాక్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, మిస్బా ఉల్ హక్, షోయబ్ అక్తర్ లాంటి మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆటగాళ్ల ఆటతీరుపైనే కాకుండా.. బాబర్ కెప్టెన్సీని కూడా తప్పుబట్టారు. కొంతమందైతే ఈ ఓటమికి బాధ్యత తీసుకుని బాబర్ తన కెప్టెన్సీని వదులుకోవాలని సలహా కూడా ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తమ జట్టు ఫెయిల్ అయిందని బాబర్ కూడా ఒప్పుకున్నాడు. "మా బౌలర్లు ఆశించినంతగా రాణించలేదు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ఇక ఫీల్డింగ్లోనూ మేం తప్పులు చేశాం. బౌండరీలు ఆపలేకపోయాం. రన్స్ కట్టడి చేయలేకపోయాం. అదే మమ్మల్ని దెబ్బతీసింది. వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఏ ఒక్క విభాగంలో ఫెయిలైనా ఓటమి తప్పుదు. అందుకే మేం ఓడిపోయాం" అని బాబర్ చెప్పుకొచ్చాడు.
ఇక పాక్, ఆఫ్ఘన్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 282 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (58), బాబర్ అజామ్ (74) మినహా ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఛేజింగ్లో అదరగొట్టింది. రహమానుల్లా గుర్జాబ్ (65), ఇబ్రహీం జద్రాన్ (87), సూపర్ ఓపెనింగ్కి తోడు రహమత్ షా (77), హష్మతుల్లా షాహిదీ (48) పాక్ బౌలర్లను ధాటిగా ఎదుర్కోవడంతో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. చారిత్రక విజయం దక్కించుకుంది.