వరల్డ్ కప్లో తమ రెండో మ్యాచులోనే పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఏకంగా 344 పరుగుల భారీ స్కోరును ఛేదించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక అదరగొట్టింది. కుశాల్ మెండిస్ (122), సదీర సమరవిక్రమ (106) సెంచరీలతో చెలరేగారు. దీంతో ఆ జట్టు 344 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇంత భారీ స్కోరును పాకిస్తాన్ ఛేజ్ చేయడం దాదాపు అసాధ్యమే అని అంతా అనుకున్నారు. దానికితోడు ఇమామ్ ఉల్ హక్ (12), బాబర్ ఆజమ్ (10) దారుణంగా విఫలమయ్యారు. దీంతో పాకిస్తాన్ పని అయిపోయిందని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటి సమయంలో మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (108), మహమ్మద్ రిజ్వాన్ (121 నాటౌట్) అద్భుతమైన పోరాటం కనబరిచారు.

వీళ్లిద్దరూ కలిసి 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో పాకిస్తాన్ గెలుపు వైపు అడుగులు వేసింది. చివర్లో సౌద్ షకీల్ (31), ఇఫ్తికర్ అహ్మద్ (22 నాటౌట్)తో కలిసి రిజ్వాన్ ఈ లాంఛనం కూడా పూర్తి చేశాడు. దీంతో పాకిస్తాన్ మరో పది బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద ఛేజ్ కావడం గమనార్హం.
ఈ విజయంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మాట్లాడుతూ రిజ్వాన్ ఆటతీరును తెగ మెచ్చుకున్నాడు. 'రిజ్వాన్ ఆడిన తీరు అద్భుతం. మంచి భాగస్వామ్యం నిర్మించి శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టాడు. మా పేసర్లు మ్యాచ్ను చక్కగా ముగించారు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. షఫీక్కు ఇదే మొదటి వరల్డ్ కప్. అయినా మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు' అని బాబర్ చెప్పుకొచ్చాడు.
ఇలా టచ్లో ఉన్నందుకే అతన్ని జట్టులోకి తీసుకున్నట్లు బాబర్ వెల్లడించాడు. 'రిజ్వాన్, షఫీక్ ఆడిన తీరు, నెలకొల్పిన భాగస్వామ్యం మా జట్టుకు బాగా ఉపయోగపడింది. ఇలా మిడిలార్డర్ ముందుకొచ్చి రాణించడం మా టీంకు చాలా గొప్ప విషయం. మేం గెలుస్తామనే పూర్తి నమ్మకంతో వాళ్లు ఆడారు.' అని సంతోషం వ్యక్తం చేశాడు.