World Cup 2023: వరల్డ్ కప్లో రెండో సెమీఫైనల్కు అంతా సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సఫారీలు ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ టోర్నీలో సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఛేజింగ్లో ఆ జట్టు చాలాసార్లు తడబడింది.
అంతేకాదు, కోల్కతాలో వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. టాస్ వేసే ముందు కూడా మైదానంలో జల్లులు పడుతుండటంతో కవర్స్ వేశారు. సాధారణంగా ఈడెన్ గార్డెన్స్ పిచ్ నుంచి బ్యాటర్లకు మంచి సహకారం ఉంటుంది. అదే సమయంలో మ్యాచ్ జరిగేకొద్దీ స్పిన్నర్లకు కూడా కొంత టర్న్ దొరుకుతుంది. ఈ క్రమంలోనే ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగాలని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా డిసైడ్ అయ్యాడు.

ఇక్కడి వాతావరణాన్ని చూసిన తర్వాతనే తను ముందుగా బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు బవుమా తెలిపాడు. అదే సమయంలో ముందుగా బ్యాటింగ్ చేయడం జట్టు బలాల్లో కూడా ఒకటని, అది కూడా ఈ నిర్ణయానికి కారణమే అని చెప్పాడు. తను ఇంకా వంద శాతం ఫిట్గా లేనని చెప్పిన బవుమా.. అయితే తాము గెలవడానికి సరిపడా ఆడాలని అభిప్రాయపడ్డాడు. అయితే భారత్తో ఇక్కడ జరిగిన మ్యాచులో ఆడిన లుంగి ఎన్గిడీ ఈ మ్యాచ్ ఆడటం లేదు. అతని స్థానంలో గెరాల్డ్ కోట్జీ ఆడుతున్నాడు.
అంటే టీమిండియాతో ఇక్కడ ఆడిన జట్టుతోనే ఇప్పుడు మళ్లీ బరిలో దిగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. తాను టాస్ గెలిచి ఉన్నా ముందుగా బ్యాటింగే ఎంచుకునే వాడినని చెప్పాడు. అయితే ప్రస్తుతం వాతావరణం కొద్దిగా పేసర్లకు అనుకూలించే అవకాశం ఉందన్నాడు. జట్టులో మార్కస్ స్టొయినిస్ ఆడటం లేదని, మార్నస్ లబుషేన్ కొనసాగుతున్నాడని వెల్లడించాడు.