World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచులు నిర్వహిస్తున్న బీసీసీఐపై ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ మండిపడ్డాడు. మ్యాచ్ మధ్యలో నైట్ క్లబ్ స్టైల్ లైట్ షోస్ ఏర్పాటు చేయడం కన్నా చెత్త నిర్ణయం ఇంకొకటి లేదన్నాడు. ఈ లైట్ షో వల్ల తనకు భయంకరమైన తలనొప్పి వచ్చిందని చెప్పాడు. నెదర్లాండ్స్తో మ్యాచులో రికార్డులు బద్దలు కొట్టిన కాసేపటికే అతను ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ వార్నర్ (104) ఈ వరల్డ్ కప్లో వరుసగా రెండో సెంచరీ నమోదు చేశాడు. ఇక కేవలం 40 బంతుల్లోనే శతకం బాదిన మ్యాక్స్వెల్.. వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అనంతరం నెదర్లాండ్స్ బ్యాటింగ్ సమయంలో ఎప్పట్లాగే డ్రింక్స్ బ్రేక్లో లైట్ షో నిర్వహించారు.

మ్యాచ్ చూసే ప్రేక్షకులకు ఎంజాయ్మెంట్ కోసం బీసీసీఐ వీటిని ఏర్పాటు చేసింది. వరల్డ్ కప్ మ్యాచులు జరుగుతున్న ప్రతి మ్యాచులోనూ ఈ లైట్ షో నిర్వహిస్తున్నారు. అయితే ఇది ముగిసిన వెంటనే కళ్లు మూసుకొని చాలా ఇబ్బంది పడినట్లు కనిపించిన మ్యాక్స్వెల్.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ లైట్ షోలు నిర్వహించాలనే నిర్ణయంపై దుమ్మెత్తిపోశాడు.
'బిగ్ బ్యాష్లో ఆడుతున్నప్పుడు కూడా ఒకసారి పెర్త్లో ఇలాగే లైట్ షో ఏర్పాటు చేశాడు. అప్పుడే నాకు బాగా తలనొప్పి వచ్చేసింది. ఈ షో ముగిసిన తర్వాత నా కళ్లు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే క్రికెటర్ల విషయంలో ఇంత కన్నా చెత్త నిర్ణయం మరొకటి లేదని నాన నమ్మకం' అని మ్యాక్సీ తెలిపాడు.
'అందుకే సాధ్యమైనంతగా కళ్లు మూసుకొని దీన్ని ఎవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. కానీ ఇది నిజంగా చాలా భయంకరమైన ఐడియా. ఫ్యాన్స్కు చాలా బాగుంటుంది. కానీ ప్లేయర్లకు నరకం కనిపిస్తుంది' అని చెప్పాడు. కొన్ని రోజుల క్రితం కివీస్తో జరిగిన మ్యాచులో ఇలాంటి లైట్ షో ముగిసిన వెంటనే.. శ్రేయాస్ అయ్యర్ కూడా అవుటైన సంగతి తెలిసిందే.
అప్పుడే లైట్ షో ముగియడంతో కళ్లు అడ్జస్ట్ అవడానికి సమయం పట్టడం సహజమే. ఈ క్రమంలోనే పూర్తిగా కళ్లు అడ్జస్ట్ అవ్వకపోవడం వల్లనే శ్రేయాస్ అయ్యర్ అవుటై ఉంటాడని అప్పుడు కొంత మంది ఫ్యాన్స్ అన్నారు. అయితే అయ్యర్ మాత్రం దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. దీంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మ్యాక్స్వెల్ ఇలా బయటపడటంతో అందరూ అయ్యర్ అవుట్ను కూడా గుర్తుచేస్తున్నారు.