బంతి వేస్తే అది సిక్స్ లేదంటే ఫోర్ అనే తరహాలో బాదేశాడు ఆసీస్ స్టార్ గ్లెన్ మ్యాక్స్వెల్. పసికూన నెదర్లాండ్స్కు చుక్కలు చూపించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్కు చూపు తిప్పుకోలేని ఎంటర్టైన్మెంట్ అందించాడు. 40వ ఓవర్లో క్రీజులోకి వచ్చి 49వ ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వరల్డ్ కప్ 24వ మ్యాచులో నెదర్లాండ్స్ను ఢీకొట్టిన ఆసీస్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచులో మొదట డేవిడ్ వార్నర్ (104) వరుసగా రెండో సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతనితోపాటు స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) కూడా వేగంగా ఆడారు. ఇక వార్నర్ అవుటైన తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ (106) రెచ్చిపోయాడు.

తను ఎదుర్కొన్నది కేవలం 44 బంతులే అయినా.. 106 పరుగులతో మెరిశాడు. అతని ఇన్నింగ్సులో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం గమనార్హం. అతని బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్ ఆనందంతో ఉర్రూతలూగారు. ఇది కదరా బ్యాటింగ్ అంటే అంటూ సోషల్ మీడియా అంతా హోరెత్తుతోంది.
కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసిన మ్యాక్స్వెల్.. వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం సాధించిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. కొన్ని రోజుల క్రితం ఇదే వరల్డ్ కప్లో సౌతాఫ్రికా స్టార్ ఎయిడెన్ మార్క్రమ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఆ టైంలో మార్క్రమ్ అన్న మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
శ్రీలంకపై కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసిన మార్క్రమ్.. ఆ మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై మాట్లాడాడు. ప్రస్తుతం క్రికెట్ చాలా మారిందని, తన రికార్డు ఎక్కువ కాలం నిలవదని అన్నాడు. ఈ వరల్డ్ కప్లోనే ఎవరో ఒకరు ఈ రికార్డు బద్దలు కొట్టేస్తాడని అన్నారు. ఆ మాటలు నిజం చేసిన మ్యాక్స్వెల్ రోజుల వ్యవధిలోనే ఆ రికార్డు బద్దలు కొట్టి కొత్త రికార్డు సృష్టించాడు.
ఇదంతా చూసిన ఫ్యాన్స్ మాత్రం ఎవరు ఓడినా, ఎవరు గెలిచినా తమకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ దొరికిందని సంతోషిస్తున్నారు. మ్యాక్సీ మామ ఇలాగే మిగతా మ్యాచుల్లో కూడా రెచ్చిపోవాలని అంటున్నారు. ఈ వరల్డ్ కప్ను వరుసగా రెండో ఓటములతో ప్రారంభించినా కూడా.. ఆసీస్ సెమీస్ చేరేలా ఉందని మరికొందరు చెప్తున్నారు.