వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పోరాటం ముగిసింది. టోర్నీ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చిన ఈ జట్టు.. అందరి కన్నా ముందు సెమీస్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచులో 33 పరుగుల తేడాతో ఈ టీం ఓడింది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తడబడింది. ట్రావిస్ హెడ్ (11), డేవిడ్ వార్నర్ (15) విఫలమయ్యారు. అయితే స్టీవ్ స్మిత్ (44), మార్నస్ లబుషేన్ (71), కామెరూన్ గ్రీన్ (47), స్టొయినిస్ (35) రాణించారు. చివర్లో ఆడమ్ జంపా (29) వేగంగా పరుగులు చేయడంతో ఆ జట్టు 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లతో చెలరేగాడు.

ఇక ఛేజింగ్లో ఇంగ్లండ్కు తొలి బంతికే షాక్ తగిలింది. స్టార్క్ వేసిన బంతిని ఆడబోయిన జానీ బెయిర్స్టో (0) ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జో రూట్ (13) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే డేవిడ్ మలాన్ (50), బెన్ స్టోక్స్ (64) ఇద్దరూ రాణించారు. మొయీన్ అలీ (42), క్రిస్ వోక్స్ (32) క్రీజులో ఉన్నంత సేపు కూడా ఇంగ్లండ్ గెలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకున్నారు.
కానీ ఆ ఆశలు కాసేపటికే ఆవిరయ్యాయి. ఇంగ్లండ్ జట్టు 48.1 ఓవర్లలో 253 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా మూడు వికెట్లు తీసుకున్నాడు. పేసర్లు స్టార్క్, హాజిల్వుడ్, కమిన్స్ తలో రెండు వికెట్లతో రాణించారు. ఈ విజయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు.
'కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. ఆరంభం అంత గొప్పగా లేకపోయినా.. ప్రతి మ్యాచులో గెలవడానికి దారి పట్టేస్తున్నారు. మ్యాచు మ్యాచుకూ మెరుగవుతున్నారు. ఇంకా మేం పూర్తి గేమ్ ఆడినట్లు ఫీల్ అవడం లేదు. కానీ ఒక్కో మ్యాచులో ఒక్కో మ్యాచ్ విన్నర్ ఉంటున్నాడు. దీంతో నెమ్మదిగా జట్టు బెస్ట్కు చేరుకుంటున్న ఫీలింగ్ కలుగుతోంది' అని కమిన్స్ అన్నాడు.
'మా ఫీల్డింగ్లో మేం చాలా కష్టపడతాం. అందరూ డైవింగ్ చేస్తూ హాట్ స్పాట్స్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. జంపా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను చేసిన 30 పరుగులు చాలా కీలకంగా మారాయి. అతను ఒక మ్యాచ్ విన్నర్. ఈ రోజు తన బెస్ట్ చూపించాడు. మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్ మళ్లీ తిరిగొస్తారు. కాబట్టి ఎలాంటి పరిస్థినైనా ఎదుర్కొనే టీం ఉందన్న నమ్మకం ఉంది. ఆడే జట్టును ఎంచుకోవడమే కష్టం' అని తెలిపాడు.