వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసుకొని, వరల్డ్ కప్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచులో సిరాజ్ కూడా తను వేసిన తొలి బంతికే వికెట్ తీయడం గమనార్హం.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. శనివారం కూడా అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఇది జరిగింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తడబడింది. అయితే మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ పోరాడటంతో 286 పరుగులు చేయగలిగింది.

ఈ మ్యాచులో ఛేజింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్కు తొలి బంతికే మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. స్టార్క్ వేసిన లెం్త్ బాల్ను ఆడేందుకు ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్స్టో ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని జస్ట్ టచ్ చేశాడు. తన ఎడమవైపు వెళ్తున్న బంతిని అద్భుతంగా డైవ్ చేసిన కీపర్ జోష్ ఇంగ్లిస్ చటుక్కున పట్టేశాడు. దీని కోసం ఆసీస్ జట్టు అప్పీల్ చేసింది.
అయితే ఎవరూ కూడా అది అవుటని అనుకోలేదు.. ఒక్క ఇంగ్లిస్ తప్ప. అతను మాత్రం కాన్ఫిడెంట్గా అప్పీల్ చేశాడు. అంపైర్ మరైస్ ఎరాస్మస్ కూడా అవునంటూ తలూపుతూ అవుటిచ్చాడు. అది ఏమాత్రం ఊహించని స్టార్క్ ఆశ్చర్యంగా నవ్వేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్కు బుమ్రా తీసిన వికెట్ గుర్తుకు వచ్చేసింది.
నెట్టింట బుమ్రా, స్టార్క్ వికెట్లను పోలుస్తూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే దీనిలోకి కూడా పాక్ను లాగి.. 'మరి స్టార్క్కు కూడా డిఫరెంట్ బంతిని ఇచ్చారేమో చూడాలి' అంటూ పాక్పై పరోక్షంగా చురకలేస్తున్నారు. మరికొందరేమో టాప్ బౌలర్లు ఇలా ఫస్ట్ బంతి నుంచే యుద్ధం మొదలు పెడతారంటూ బుమ్రా, స్టార్క్ ఇద్దర్నీ మెచ్చుకుంటున్నారు.