ఆస్ట్రేలియా గెలుపు పాకిస్తాన్ కొంప ముంచింది. నెదర్లాండ్స్ జట్టుపై భారీ గెలుపుతో పాయింట్స్ టేబుల్ లో ఆసీస్ టాప్ 4 లోకి దూసుకొచ్చింది. దీంతో పాకిస్తాన్ 5 వ స్థానానికి పడిపోయింది. ఈ దెబ్బతో ఇక పాకిస్తాన్ ఇంటి దారి పట్టేలా కనిపిస్తోంది.
వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్ లో టాప్ 4 జట్లు సెమీస్ చేరతాయి. ఇప్పటికే సగం టోర్నీ పూర్తయింది. ఆడిన 5 మ్యాచుల్లో ఐదింటిలోనూ గెలిచింది 10 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 5 మ్యాచుల్లో 4 విజయాలతో న్యూజిలాండ్, సౌతాఫ్రికా సమానంగా ఉన్నా.. నెట్ రన్ రేట్ కారణంగా సౌతాఫ్రికా రెండో స్థానంలో నిలవగా.. మూడో స్థానంలో న్యూజిల్యాండ్ ఉంది. ఈ నేపథ్యంలో నాలుగో స్థానం కోసం పోటీ రసవత్తరంగా మారింది.

ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ మ్యాచ్ ముందు వరకు పాకిస్తాన్ 5 మ్యాచుల్లో 2 గెలిచి 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉండేది. కానీ నెదర్లాండ్స్ పై 309 పరుగుల తేడాతో వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధించిన ఆసీస్ పాయింట్ల పట్టికలో టాప్ 4 కు దూసుకొచ్చింది. ఆసీస్ కూడా 5 మ్యాచుల్లో రెండింటిలోనే గెలిచి 4 పాయింట్లతోనే ఉన్నా నెట్ రన్ రేట్ విషయంలో పాక్ కంటే చాలా ముందుంది. ప్రస్తుతం పాక్ రన్ రేట్ -0.400 గా ఉంటే ఆస్ట్రేలియాది +1.142 గా ఉంది. దీంతో పాక్ కు కష్టాలొచ్చి పడ్డాయి.
పాక్ తన తదుపరి మ్యాచ్ లలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ లను ఢీ కొట్టబోతోంది. ఇందులో బంగ్లాదేశ్ మినహా మిగిలిన జట్లన్నీ పటిష్టమైనవే. దీంతో చెత్త ఫాం తో ఇబ్బంది పడుతున్న పాక్ కు ఈ మ్యాచ్ లలో గెలవడం కష్టమనే చెప్పాలి. ఈ లెక్కన పాక్ టోర్నీ నుంచి వైదొలగడం ఖాయంగా కనిపిస్తోంది.