లక్నో: వరల్డ్ కప్ 2023లో భాగంగా నేడు క్రికెట్ దిగ్గజాలు తలపడుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటోంది. ఈ రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా స్టేడియం దీనికి వేదిక. సమవుజ్జీ జట్లు కావడంతో స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.
తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది భారత్. ఆ జట్టు నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఊది పడేసింది. విరాట్ కోహ్లీ- 87, కేఎల్ రాహుల్- 97 పరుగులతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓటమితో తన వరల్డ్ కప్ 2023 హంటింగ్ను మొదలు పెట్టిన కంగారూలు ప్రస్తుతం మరో బలమైన జట్టుతో ఎదుర్కొనాల్సి రావడంతో పూర్తి ఒత్తిడిలో ఉంటోంది.

దీనికి భిన్నమైన పరిస్థితిలో ఉంది దక్షిణాఫ్రికా. తొలి గేమ్లో శ్రీలంకపై భారీ విజయం సాధించిన ఊపులో ఉంది. ఆ మ్యాచ్లో ప్రొటీస్ 428 పరుగులను నమోదు చేసిన విషయం తెలిసిందే. ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కారు. ఇప్పుడు ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోన్నారు.
ఈ పరిస్థితుల్లో టాస్ గెలిచింది ఆస్ట్రేలియా. జట్టు కేప్టెన్ పాట్ కమ్మిన్స్.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దక్షిణాఫ్రికాపై రెండు మార్పులతో బరిలోకి దిగింది ఆసీస్. భారత్ కొట్టిన దెబ్బకు ఇద్దరిని పక్కన పెట్టింది. కామెరాన్ గ్రీన్ స్థానంలో ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ స్థానంలో జోస్ ఇంగ్లిస్ను తీసుకుంది.
తుదిజట్టులో- డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నుస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోస్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్కు చోటు దక్కింది. దక్షిణాఫ్రికాలో- క్వింటన్ డికాక్, టెంబా బావుమా (కేప్టెన్), రస్సీ వాన్ డెర్ డుస్సాన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జెన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసొ రబడ, లుంగి ఎంగిడి, తబ్రేజ్ షాంసీ ఉన్నారు.