చాలామంది ప్రొఫెషనల్ క్రికెటర్లు 34 ఏళ్ల వయసులో ఆటకు వీడ్కోలు చెప్పేస్తుంటారు. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ వయసులో మంచి ఫామ్ అందుకున్నాడు. టీంకు వరల్డ్ కప్ అందించడం కోసం బ్యాటింగ్ లైనప్ను ముందుండి నడిపించేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికీ టీమిండియా బ్యాటింగ్ కష్టాల్లో ఉంటే అందరూ కోహ్లీపైనే ఆధారపడతారు. ఇటీవల ముగిసిన ఆసియా కప్లో పాకిస్తాన్పై చెలరేగిన కోహ్లీ.. అత్యద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీసులో మొదటి రెండు మ్యాచుల్లో అతనికి విశ్రాంతి ఇచ్చారు.

రాజ్కోట్ వేదికగా జరిగే మూడో వన్డేలో కోహ్లీ కూడా ఆడనున్నాడు. ఈ క్రమంలో కింగ్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి అతని బెస్ట్ ఫ్రెండ్, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వయసులో ఇక వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడా? అని కొందరు అడిగిన ప్రశ్నకు ఏబీడీ బదులిచ్చాడు.
నిజంగా కోహ్లీ రిటైర్ అవ్వాలని అనుకుంటే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత బెస్ట్ సమయం అని డివిలియర్స్ అన్నాడు. 'వచ్చే వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికా వచ్చేందుకు కూడా కోహ్లీ రెడీగా ఉంటాడని నాకు తెలుసు. కానీ దానికి ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచించకండా.. మన ముందున్న విషయంపై ఫోకస్ పెడదాం. కోహ్లీ కూడా ఇదే చెప్తాడని నా నమ్మకం' అని డివిలియర్స్ అన్నాడు.
అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కోహ్లీ వన్డేలకు వీడ్కోలు పలకడానికి సరైన సమయం అదే అవుతుందని కూడా చెప్పాడు. 'ఇక అప్పుడు వచ్చి అందరికీ థ్యాంక్స్ చెప్పేసి, నా కెరీర్ చివరి దశను కూడా ఎంజాయ్ చేయండి. ఇకపై కేవలం టెస్టులు, కొంచెం ఐపీఎల్ మాత్రమే ఆడతా అని కోహ్లీ చెప్పడానికి టీమిండియా ట్రోఫీ నెగ్గిన టైం కన్నా గొప్ప సందర్భం ఏముంటుంది?' అని అడిగాడు.
అయితే ఇప్పటికీ కోహ్లీ ఫిట్గా ఉన్నాడని ఏబీడీ మెచ్చుకున్నాడు. 'ఇప్పటికీ కోహ్లీ మంచి షేప్లో ఉన్నాడు. మానసికంగా కూడా రెడీగానే ఉన్నాడు. మధ్య మధ్యలో తనకు విశ్రాంతి ఇస్తూనే ఉన్నారు. ఇది నిజంగా మంచి ఆలోచన. దీని వల్ల తనలో పరుగులు చేయాలనే ఆకలి, ఫైర్ అలాగే ఉంటాయి' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.