వరల్డ్ కప్ టీంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని సఫారీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్గా ఉన్న సూర్యకుమార్.. వన్డేల్లో తన సత్తా చాటలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ ఫార్మాట్లో 24 ఇన్నింగ్సులు ఆడిన సూర్య కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. కేవలం 24.33 సగటు మాత్రమే నమోదు చేశాడు.
ఈ ఫార్మాట్లో తన ఆటతీరు ఏమాత్రం బాగలేదని సూర్య స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. డివిలియర్స్ స్టైల్లో మైదానం నలుమూలలా ఆడటాన్ని అలవాటు చేసుకున్న సూర్యపై ఈ సఫారీ లెజెండ్ కూడా అభిమానాన్ని చూపించాడు. 'నేను సూర్యకు చాలా పెద్ద ఫ్యాన్. నేను ఎలా ఆడే వాడినో సూర్య కూడా దాదాపు అలాగే ఆడతాడు. కానీ వన్డేలను మాత్రం తను ఇంకా క్రాక్ చేయలేదు' అని డివిలియర్స్ అన్నాడు.

'అతనికి జస్ట్ చిన్న మైండ్ స్విచ్ కావాలి అంతే. ఆ తర్వాత వన్డేల్లో రాణించడానికి అవసరమైన అన్ని లక్షణాలు సూర్యలో ఉన్నాయి. వరల్డ్ కప్ స్క్వాడ్లో సూర్య ఉండటం చూసి నేను చాలా సంతోషించా. ఈ మెగా టోర్నీలో అతనికి ఆడే అవకాశం కూడా వస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం టీమిండియా బ్యాలెన్స్ చూస్తే.. అతనికి టీంలో చోటు దొరకడం కష్టమే అనిపిస్తోంది. కానీ వరల్డ్ కప్ చాలా సుదీర్ఘమైన టోర్నీ. ఏం జరుగుతుందో చూద్దాం' అని చెప్పాడు.
అదే సమయంలో వరల్డ్ కప్ టీంలో చోటు దక్కని సంజూ శాంసన్ గురించి కూడా డివిలియర్స్ మాట్లాడాడు. సంజూ వద్ద కూడా క్రికెట్లో ఉండే అన్ని షాట్లు ఉన్నాయని, అయితే వన్డేలు ఆడేందుకు మైండ్ సెట్ మాత్రమే కొంత మారాలని అన్నాడు. వీళ్లిద్దరూ కూడా చాలా గొప్ప ప్లేయర్లని డివిలియర్స్ కొనియాడాడు. విండీస్ టూర్లో పెద్దగా రాణించని సంజూకు ఆసియా కప్లో కూడా చోటు దక్కని సంగతి తెలిసిందే.