World Cup 2023: ఈ వరల్డ్ కప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్లింది. లీగ్ దశలో ఒక్క ఓటమి కూడా లేకుండానే సెమీఫైనల్లో అడుగుపెట్టింది. వాంఖడే వేదికగా జరిగే సెమీస్ మ్యాచులో కివీస్ను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ టోర్నీ ఆసాంతం జట్టుకు శుభారంభాలు అందిస్తూనే ఉన్నాడీ స్టార్ బ్యాటర్.
ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా రోహిత్ను మెచ్చుకున్నాడు. కొందరు ఫ్యాన్స్ అన్న మాటలను ఒప్పుకున్న చోప్రా.. 'నేను వంద శాతం మీ మాటలు కరెక్ట్ అని ఒప్పుకుంటా. టాపార్డర్లో బ్యాటింగ్ చేసే సమయంలో.. అది ఛేజింగ్ అయినా, ఫస్ట్ బ్యాటింగ్ అయినా సరే మొత్తం 50 ఓవర్లు మన ముందు ఉంటాయి. అప్పుడు అందంగా ఇన్నింగ్స్ నిర్మించాలంటే నెమ్మదిగా ఆడుతూ ముందుకు సాగుతారు' అన్నాడు.

'అదే టైంలో పెద్ద స్ట్రోక్స్ కూడా వేయొచ్చు. ఈ విషయంలో రోహిత్ను ఎవరూ ఆపలేరు. ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ ఏవీ కూడా రోహిత్ ముందు పెద్దగా పనిచేయవు. ఎందుకంటే అతను బంతిని కొడితే అది స్టాండ్స్లోనే పడుతుంది. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి. అతని శరీరంలో ఒక్కటంటే ఒక్క సెల్ఫిష్ బోన్ కూడా లేదు. భయం లేకుండా బంతిని బాదేందుకే చూస్తున్నాడు' అని మెచ్చుకున్నాడు.
ఈ వరల్డ్ కప్లో టీమిండియాకు అదిరే ఆరంభాలు అందిస్తూ వస్తున్న రోహిత్ శర్మ.. కేవలం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచులో మాత్రమే పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. మిగతా అన్ని మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 9 మ్యాచుల్లో 121.49 స్ట్రైక్ రేటుతో 503 పరుగులు చేశాడు. ఇలా ఎగ్రెసివ్గా ఆడుతున్నా కూడా వరల్డ్ కప్ టాప్ స్కోరర్ల జాబితాలో నాలుగో ప్లేస్లో ఉండటం గమనార్హం.