
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సమిష్టి ప్రదర్శనతో టైటిల్ వేటలో మరో ముందడుగు వేసింది. బర్మింగ్ హామ్ వేదికగా మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్లో బంగ్లా అద్భుతంగా పోరాడింది. ఒకానొక దశలో విజయం సాధిస్తుందని కూడా అనుకున్నారంతా. అయితే టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా ఓటమిపాలైంది. బంగ్లా ఆటగాళ్లు షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది.
ఈ మ్యాచ్లో మహ్మద్ షమీ చెత్త ఫీల్డింగ్పై కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సంఘటన 27వ ఓవర్లో చోటు చేసుకుంది. బుమ్రా బౌలింగ్లో బంతిని మిడ్ వికెట్గా ఆడిన లిట్టన్ దాస్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో పరిగెత్తికుంటూ వెళ్లి బంతిని అందుకున్న బుమ్రా డైరెక్ట్ త్రో విసిరాడు.
అయితే, బంతి వికెట్లను తాకకుండా బౌండరీ లైన్ దిశగా దూసుకుపోయింది. ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న మహ్మద్ షమీ నెమ్మదిగా బంతిని అందుకు త్రో విసరడంతో బంగ్లా బ్యాట్స్మెన్ మరో రన్ తీశారు. దీంతో షమీ ఫీల్డింగ్పై కెప్టెన్ విరాట్ కోహ్లీ "అక్కడ నిద్ర పోతున్నావా?" అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.
కోహ్లీ... షమీని తిడుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే, ఈ ప్రపంచకప్లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయపడటంతో అతడి స్థానంలో షమీ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఈ మెగా టోర్నీలో భాగంగా ఆప్ఘనిస్థాన్, వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో నాలుగేసి వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. గత ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో షమీ 9 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 68 పరుగులు ఇచ్చాడు.