
ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ లో సందడి చేస్తోంది. టోర్నీలో భాగంగా శనివారం టీమిండియా, న్యూజిలాండ్తో తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కి ముందు తన సహచర ఆటగాళ్లు అయిన ధోని, హార్ధిక్ పాండ్యాలతో కలిసి శిఖర్ ధావన్ సందడి చేశాడు.
ఈ సందర్భంగా వీరిద్దరి స్పీడును అందుకోవాలని ప్రయత్నిస్తున్నానని ఓ వీడియోని తన ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, పాండ్యా ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే.
ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించి నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో వీరిద్దరి స్పీడును అందుకోవాలన్న ఉద్దేశంతో ధావన్ ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. భారత్ తరుపున వరల్డ్ కప్ జట్టులో ధోని, పాండ్యా ఎంతో కీలకం.
టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్ 5న సౌతంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. వరల్డ్కప్కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి.