మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు
ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో అనూహ్యంగా బెన్స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తీసిన రెండు పరుగులతోపాటు ఓవర్ త్రో వల్ల అదనంగా మరో నాలుగు పరుగులు ఆ జట్టుకు కలిసివచ్చాయి.
ఓవర్ త్రో కారణంగా
ఈ ఓవర్ త్రో కారణంగా మ్యాచ్ ఫలితమే తారుమారైంది. ఈ పరుగుల కారణంగా తొలుత ఇరు జట్లు ప్రధాన స్కోరు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ను నిర్వహించారు. సూపర్ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఆతిథ్య జట్టైన ఇంగ్లాండ్ను ఐసీసీ విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్కు ఆరు పరుగులు
అయితే ఈ ఓవర్ త్రో విషయంలో అంపైర్లు ఇంగ్లాండ్కు ఆరు పరుగులు కేటాయిచడం వివాదాస్పదమైంది. నిబంధనల ప్రకారం ఐదు పరుగులివ్వాల్సి ఉండగా అంపైర్లు ఆరు పరుగులిచ్చారని మాజీ అంపైర్ సైమన్ టోఫెల్ విమర్శించాడు. సైమన్ టోఫెల్ మాట్లాడుతూ "నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్మెన్ పిచ్పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి" అని ఆయన అన్నారు.
బౌండరీతో పాటు సింగిల్నే
"వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్ స్ట్రయికింగ్ తీసుకోవాల్సి వచ్చేది. అయితే తాను అంపైర్ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయింది" అని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఓవర్త్రో నిబంధనలపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని ఎమ్సీసీ భావిస్తోంది.