
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ధరించిన 'బలిదాన్ గ్లోవ్స్'పై పెద్ద చర్చకు తెరలేచిన సంగతి తెలిసిందే. ధోని ధరించిన గ్లోవ్స్ మీద ఉన్న 'బలిదాన్ బ్యాడ్జ్' లోగోని తొలగించాల్సిందేనని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అది సైన్యానికి సంబంధించిన గుర్తు కాదని బీసీసీఐ లేఖ రాసినప్పటికీ ఐసీసీ సంతృప్తి చెందలేదు. ధోని 'బలిదాన్ బ్యాడ్జ్'ను గ్లోవ్స్ మీద ముద్రించడం వెనుక ఎలాంటి రాజకీయ, వాణిజ్య ప్రయోజనాలు లేవని బీసీసీఐ వివరణ ఇచ్చింది. దేశభక్తిని చాటేందుకే ధోని అలా చేశాడు కాబట్టి బలిదాన్ బ్యాడ్జ్ ఉన్న గ్లోవ్స్ను తదుపరి మ్యాచ్ల్లో కూడా కొనసాగనివ్వాలని ఐసీసీని బీసీసీఐ కోరింది.
ఈ మేరకు బీసీసీఐ పాలకుల కమిటీ చీఫ్ వినోద్ రాయ్ ఐసీసీకి లేఖ రాశారు. అందులో ధోని ధరించిన గ్లౌవ్స్పై ఉన్న లోగోను తొలగించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్ అభిమానులు సైతం ధోనికి మద్దతుగా నిలిచారు. క్రికెటర్లు ఉపయోగించే దుస్తులు, పరికరాలపై స్పాన్సర్ల లోగోలు మినహాయిస్తే.. రాజకీయ, మత, వాణిజ్య ప్రయోజనాలతో ముడిపడ్డ చిహ్నాలు ఉండకూడదన్నది ఐసీసీ నిబంధన.
దీంతో చేసేదేమి లేక ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో బలిదాన్ చిహ్నాం లేని గ్లోవ్స్ను వేసుకుని ఆడాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లోనూ బలిదాన్ చిహ్నం ఉన్న గ్లోవ్స్నే ధోనీ వాడతాడని, అయితే ఆ చిహ్నాలు కనిపించకుండా టేపు అతికించే అవకాశముందని ప్రచారం జరిగింది. అయితే, ధోని అలా చేయలేదు.

దీనిపై అనవసర రాద్దాంతం చేయడం ఇష్టం లేని ధోని కొత్త గ్లోవ్స్తోనే మ్యాచ్ బరిలోకి దిగాడు. ఓవల్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో శిఖర్ ధావన్(117; 109 బంతుల్లో 16 ఫోర్లు), రోహిత్ శర్మ(57; 70 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్), విరాట్ కోహ్లి(82; 77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
{headtohead_cricket_1_3}