
హైదరాబాద్: తన ఇగో వల్లే క్రికెట్ కెరీర్ను అంబటి రాయుడు నాశనం చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. అంబటి రాయుడు బుధవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మాట్ల నుంచి తాను తప్పుకుంటున్నట్లు రాయుడు అధికారిక ప్రకటన చేశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బీసీసీఐకి సైతం తెలియజేశాడు. అయితే, ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో చోటు దక్కకపోవడం వల్లే మనస్తాపం చెందిన అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే, టీమిండియా తరుపున మొత్తం 55 వన్డేలు ఆడిన అంబటి రాయుడు 1694 పరుగులు చేశాడు.
రాయుడు రిటైర్మెంట్ నిర్ణయం సరైంది కాదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. "రాయుడు ఇలా చేసి ఉండాల్సింది కాదు. ప్రపంచకప్లో చోటు దక్కకపోవడంపై అతడు తీవ్ర మనస్తాపానికి గురైన మాట నిజమే. రోహిత్ శర్మ కూడా 2011 ప్రపంచకప్లో సెలక్ట్ కాలేదు. అయితే, ఇప్పుడు అతడు ఎక్కడు ఉన్నాడో చూడండి" అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
మరొక నెటిజన్ అయితే "రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అతడి కెరీర్ ఇలా ముగియడం బాధగా ఉంది. రాయుడి 3D గ్లాసెస్ ట్వీట్ అతడికి ప్రపంచకప్లో చోటు దక్కకుండా చేసింది. తాను చేసిన ఓ తప్పు ట్వీట్కు అంబటి రాయుడు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. తన ఇగో వల్లే కెరీర్ నాశనం అయింది" అంటూ ట్వీట్ చేశాడు.
మరోక నెటిజన్ అయితే అంబటి రాయుడు బీసీసీఐపై దాదాగిరి చేస్తున్నాడంటూ మండిపడ్డాడు. ఈ దాదాగిరి వల్లే చాలా మంది టాలెండ్ ప్లేయర్లు తమ కెరీర్ను నాశనం చేసుకున్నారని ట్వీట్ చేశాడు. వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ప్రకటించిన సమయంలోనే రిషబ్ పంత్, అంబటి రాయుడులను స్టాండ్బై ఆటగాళ్లుగా సెలక్టర్లు ప్రకటించారు.
అయితే, తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో జట్టు నుంచి వైదొలగడంతో అతడి స్థానంలో స్టాండ్ బై ఆటగాళ్లలో ఒకడైన రిషబ్ పంత్ను జట్టులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రపంచకప్లో రాయడుకు బదులు జట్టులో స్థానం సంపాదించుకున్న విజయ్ శంకర్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
విజయ్ శంకర్ నిష్క్రమణ నేపథ్యంలో అంబటి రాయుడికి అవకాశం వస్తుందని అందరూ భావించారు. అయితే, అంబటి రాయుడుని కాదని విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకున్నారు. స్టాండ్బైగా ఉన్న అంబటి రాయుడుని కాదని మయాంక్ను ఎలా ఎంపిక చేశారన్న దానిపై ప్రస్తుతం వివాదం చెలరేగుతోంది. రెండోసారి కూడా రాయుడికి అవకాశం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.