పెర్త్: తాను ఒత్తిడి ఎదురైనప్పుడు ఎలా ఉంటాననే విషయం క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. తాను ఒత్తిడికి లోనుకానని అందరు అనుకుంటారని, కానీ అది నిజం కాదని చెప్పాడు. కాకపోతే ఇలాంటి పరిస్థితులను ఎక్కువసార్లు ఎదుర్కొన్నానని కాబట్టి ఎలా వ్యవహరించాలో తనకు కొంచం తెలుసునని చెప్పాడు.
లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో కలిసి ఆడుతున్నప్పుడు వాళ్లకు తగినంతగా మార్గదర్శనం చేస్తానని చెప్పాడు. చివరి ఆటగాడి వరకూ తమ వాళ్లు ఎంతోకొంత చేయగలరని చెప్పాడు. తనకు నాకౌట్లో వాళ్లే కీలకమవవచ్చునని చెప్పాడు.

సురేష్ రైనా షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దాని పైన ధోనీ స్పందించాడు. వెస్టిండీస్ మ్యాచ్లో షార్ట్ పిచ్ బంతితోనే పెవిలియన్ చేరాడు. దీనిపై ధోని మాట్లాడుతూ.. ఈ సమస్య రైనాది కాదని, మీడియాదే అన్నాడు.
ఈ తరహా బంతులకు పలు దేశాల ఆటగాళ్లు అవుట్ అవుతారన్నాడు. మీడియాకు మాత్రం రైనా ఒక్కడే కనిపిస్తున్నాడని విమర్శించాడు. తన వరకు అయితే రైనా బాగా ఆడుతున్నాడని, గతంలో ఐదో నెంబరులో వచ్చిన యువరాజ్ సింగ్ తప్ప ఆటగాళ్లెవరూ విజయవంతం కాలేదన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఆడించి ప్రయోగం చేసినా ఫలితం దక్కలేదని, రైనాకు మద్దతివ్వాల్సిన అవసరముందన్నాడు.