వరల్డ్ ఛాంపియషిప్ ఆఫ్ లెజెండ్స్-2024లో భాగంగా పాకిస్థాన్ ఛాంపియన్స్తో తలపడిన మ్యాచ్లో ఇండియా ఛాంపియన్స్ 68 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 243 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ కమ్రాన్ అక్మల్ (77; 40 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), షర్జీల్ ఖాన్ (72; 30 బంతుల్లో, 7 ఫోర్లు, 5 సిక్సర్లు), మక్సూద్ (51; 26 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు ) సత్తాచాటారు.
ఆర్పీ సింగ్, అనురీథ్ సింగ్, ధావల్ కులకర్ణి, పవన్ నేగి తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. సురేశ్ రైనా (52; 40 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో పోరాడాడు. ఓపెనర్లు అంబటి రాయుడు (39; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రాబిన్ ఉతప్ప (22; 12 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్) ఫర్వాలేదనపించారు. వాహబ్ రియాజ్, షోయబ్ మాలిక్ చెరో మూడు వికెట్లు తీశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఉతప్ప సిక్సర్లతో చెలరేగాడు. అయితే అతను ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రైనాతో రాయుడు ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. వీరిద్దరు 8 ఓవర్లలో జట్టు స్కోరును 89కు చేర్చి జట్టును పోటీలో ఉంచారు. కానీ ఆ తర్వాత భారత్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్లో సురేశ్ రైనా ఒంటరి పోరాటం కొనసాగిస్తూ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు.
యువరాజ్ సింగ్ (14), ఇర్ఫాన్ పఠాన్ (15), అనురీథ్ సింగ్ (20 నాటౌట్) పరుగులు చేశారు. కాగా, భారత్ ఛాంపియన్స్కు హర్భజన్ నాయకత్వం వహిస్తున్నాడు. జులై 13 వరకు జరగనున్న వరల్డ్ ఛాంపియషిప్ ఆఫ్ లెజెండ్స్లో ఆరు దేశాలు పాల్గొన్నాయి. భారత్, పాకిస్థాన్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆడుతున్నాయి. ప్రతి జట్టు అయిదు మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన ఇండియా రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.