ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2024లో 'ఇండియా ఛాంపియన్స్' మరో ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియా ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నాలుగు మ్యాచ్లు ఆడిన భారత్కు ఇది వరుసగా రెండో ఓటమి. హర్భజన్ సింగ్ సారథ్యంలో రిటైర్మెంట్ ప్రకటించిన భారత ప్లేయర్లు ఈ టోర్నీని ఆడుతున్న విషయం తెలిసిందే.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 199 పరుగులు చేసింది. డానియల్ క్రిస్టియన్ (69 ; 33 బంతుల్లో, 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం సాధించాడు. ఓపెనర్ షాన్ మార్ష్ (41; 27 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడాడు. ఫెర్గూసన్ (26; 22 బంతుల్లో, 3 ఫోర్లు), బెన్ కటింగ్ (24 నాటౌట్; 13 బంతుల్లో, 3 సిక్సర్లు) కీలక పరుగులు చేశారు. ధావల్ కులకర్ణి రెండు, హర్భజన్, ఆర్పీ సింగ్, అనురిథ్ సింగ్ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. యూసఫ్ పఠాన్ (78; 48 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్), అంబటి రాయుడు (26 నాటౌట్; 17 బంతుల్లో, 4 ఫోర్లు) పోరాడారు. ఛేజింగ్ ఇండియా ఆదిలోనే ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (12; 9 బంతుల్లో, 2 ఫోర్లు), ఇర్ఫాన్ పఠాన్ (9; 7 బంతుల్లో, 2 ఫోర్లు) వికెట్లు కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిర రైనా (12; 10 బంతుల్లో, 2 ఫోర్లు) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.
అనంతరం యువరాజ్ సింగ్ (19; 18 బంతుల్లో, 2 ఫోర్లు), పవన్ నేగి (11; 10 బంతుల్లో, 1 సిక్సర్)తో కలిసి యూసఫ్ పఠాన్ ఇన్నింగ్స్ లక్ష్యాన్ని క్రమంగా కరిగించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మరోవైపు కావాల్సిన రన్రేటు భారీగా పెరిగిపోయింది. 15 ఓవర్లకు భారత్ స్కోరు 113 మాత్రమే. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన రాయుడు ఇన్నింగ్స్ స్వరూపమే మార్చాడు. యూసఫ్తో కలిసి బౌండరీలతో హోరెత్తించాడు. కానీ వీరిద్దరి పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.
జులై 13 వరకు జరగనున్న వరల్డ్ ఛాంపియషిప్ ఆఫ్ లెజెండ్స్లో ఆరు దేశాలు పోటీపడుతున్నాయి. భారత్, పాకిస్థాన్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆడుతున్నాయి. ప్రతి జట్టు అయిదు మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ఇండియా రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.