వరల్డ్ ఛాంపియన్షిఫ్ ఆఫ్ లెజెండ్స్-2024లో 'ఇండియా ఛాంపియన్స్' ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్పై 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తుదిపోరుకు దూసుకెళ్లింది. నాకౌట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చెలరేగిపోయే యువరాజ్ (59; 28 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈసారి కూడా విజృంభించాడు. టైమ్ గ్యాప్ వచ్చింది కానీ, టైమింగ్లో కాదనే రీతిలో విధ్వంసం సృష్టించాడు.
అతనికి తోడుగా ఓపెనర్ రాబిన్ ఉతప్ప (65; 35 బంతుల్లో, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), పఠాన్ బ్రదర్స్ ఇర్ఫాన్ (50; 19 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు), యూసఫ్ (51; 23 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 254 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియాకు శుభారంభం దక్కలేదు. అంబటి రాయుడు (14; 11 బంతుల్లో, 3 ఫోర్లు), సురేశ్ రైనా (14; 11 బంతుల్లో, 3 ఫోర్లు) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చి యువీతో కలిసి ఉతప్ప ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఉతప్ప దూకుడుగా ఆడటం, యువరాజ్ అతనికి సహకరించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 10 ఓవర్లకు జట్టు స్కోరు 101/2. ఆ తర్వాత ఉతప్ప ఔటైన అనంతరం యువీ టాప్ గేర్లోకి దూసుకెళ్లాడు.
బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ కూడా చెరేగడంతో పరుగుల వరద పారింది. ఓ దశలో 10 బంతుల్లో 15 పరుగులు చేసిన ఇర్ఫాన్ 18 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అనంతరం భారీ ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 168 పరుగులే చేసింది. టిమ్ పైన్ (40; 32 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ధావల్ కులకర్ణి, పవన్ నేగి తలో రెండు వికెట్లు తీశారు.