వరల్డ్ కప్లో మంచి జోరుమీదున్న టీమిండియాకు హార్దిక్ పాండ్యా రూపంలో గట్టి షాక్ తగిలింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో అతను గాయపడ్డాడు. పాండ్యా గాయంతో టీమిండియా బ్యాలెన్స్ దెబ్బతిన్నదనే చెప్పాలి. పాండ్యా కనుక టీంలో ఉంటే అవసరమైతే స్పిన్, లేదంటే పేస్.. ఏ విభాగంపై అయినా టీం ఫోకస్ పెట్టగలిగేది.
ఇప్పుడు పాండ్యా లేకపోవడంతో కచ్చితంగా పేస్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. దీంతో షమీ వంటి సీనియర్పై ఆధారపడక తప్పదు. అయితే పాండ్యాకు గాయమవగానే స్కానింగ్లో తీయించారు. కేవలం న్యూజిల్యాండ్ మ్యాచ్ మాత్రమే అతను ఆడటం లేదని, ఇంగ్లండ్ మ్యాచ్ సమయానికి జట్టుతో చేరతాడని టీం మేనేజ్మెంట్ భావించింది.

ఇదే విషయంపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన కూడా చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితి వేరుగా ఉంది. భారత్ ఆడే తదుపరి మూడు మ్యాచులకు కూడా పాండ్యా అందుబాటులో ఉండటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాండ్యా విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాయంతో బాధ పడుతున్న పాండ్యాకు సరైన ఇంజెక్షన్లు ఇస్తే అతను మ్యాచ్ ఆడగలడట.
కానీ దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. శనివారం నాటికి పాండ్యా మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెడతాడని సమాచారం. ఎటూ ప్రాక్టీస్ మొదలు పెట్టేస్తున్నాడు కాబట్టి.. అతనికి ఇంజెక్షన్లు ఇచ్చి ఇంగ్లండ్తో మ్యాచులో బరిలో దింపొచ్చు. కానీ ఇది సరైన పద్ధతి కాదని బీసీసీఐ భావిస్తోందట. అందుకే అతను సహజంగా కోలుకునే వరకూ వెయిట్ చేయాలని నిర్ణయించింది.
ఒకవేళ పాండ్యా కనుక తర్వాతి మూడు మ్యాచులు ఆడకపోతే.. సరిగ్గా సెమీస్ ముందు నెదర్లాండ్స్తో జరిగే మ్యాచులో అతను ఆడతాడు. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ సమయంలో ఫిట్గా ఉంటాడు. ఇది కూడా ఒకందుకు మంచిదేనని, దీంతో షమీ వంటి కీ ప్లేయర్కు గేమ్ టైం దొరుకుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.