హైదరాబాద్: ఇంగ్లాండ్ దేశవాళీ టోర్నీ కౌంటీ ఛాంపియన్షిప్లోకి టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బరిలో దిగనున్నాడు. వర్సెస్టర్షైర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అశ్విన్ మరోసారి ఆ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. ఈ టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత అశ్విన్ వర్సెస్టర్షైర్ తరుపున ఆడనున్నాడు. ఈ ఒప్పందానికి బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌంటీ ఛాంపియన్ షిప్ 2018లో భాగంగా సెప్టెంబర్లో ఎసెక్స్, యార్క్షైర్ జట్లతో జరగనున్న కీలక మ్యాచ్ల్లో అశ్విన్ ఆడనున్నాడు.
దక్షిణాఫ్రికా క్రికెటర్ వెయిన్ పార్నెల్ స్థానంలో అశ్విన్ ఆడనున్నాడు. గత సీజన్లో అశ్విన్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఛాంపియన్షిప్లో భాగంగా మొత్తం నాలుగు మ్యాచ్లాడిన అశ్విన్ 20 వికెట్లు తీశాడు. అందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండటం విశేషం.
ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ అనంతరం అతడు వర్సెస్టర్షైర్ జట్టుతో కలవనున్నాడు. ఈ సందర్భంగా ఆ జట్టు కోచ్ కెవిన్ షార్ప్ మాట్లాడుతూ "అశ్విన్ ప్రపంచస్థాయి ఆటగాడు. వర్సెస్టర్షైర్పై అతనికి ప్రత్యేక అభిమానం ఉంది. తిరిగి జట్టులోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి" అని అన్నాడు.
"కచ్చితంగా అశ్విన్ రాకతో జట్టుకు భారీ లాభం చేకూరనుంది. మా జట్టు మంచి విజయాలు సాధించేందుకు గతేడాది వేసవి సీజన్లో అద్భుతంగా రాణించాడు" అని కెవిన్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో కోహ్లీసేన ఆగస్టు 1న తొలి టెస్టు ఆడనుంది.
ఈ టెస్టు బర్మింగ్ హామ్ వేదికగా జరగనుంది. ఈ తొలి టెస్టుకు ముందు టీమిండియా జులై 25న ఎసెక్స్ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది.