కోల్కతా: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఒకప్పుడు కోచ్ను సెలక్ట్ చేశానని, మరోసారి ఆ అవకాశం వచ్చిందని, ఎప్పుడో ఒకప్పుడు తాను కూడా కోచ్ ఇంటర్వ్యూకు వెళ్తానని వ్యాఖ్యానించాడు.
ఇప్పటి వరకు భారత కోచ్ పదవికి సంబంధించిన ఇంటర్వ్యూకు తాను హాజరు కాలేదన్నాడు. భవిష్యత్తులో ఆ రోజు వస్తుందనుకుంటున్నానని చెప్పాడు. 2005లో గ్రెగ్ చాపెల్ కోచ్ నియామకంలో తన పాత్ర ఉందని చెప్పాడు.

ఇప్పుడు మరోసారి తన సహచరులు సచిన్ టెండుల్కర్, వివిఎస్ లక్ష్మణ్, బీసీసీఐ సెక్రటరీ అజయ్, ప్రెసిడెంట్ అనురాగ్ ఠాకుర్లతో కలిసి కోచ్ను ఎంపిక చేసే బాధ్యత వచ్చిందన్నాడు. ఇవన్నీ తన జీవితంలో చోటు చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నాడు.
నిజాయితీగా చెప్పాలంటే రెండున్నరేళ్ల క్రితం కోచ్ పదవిని తాను ఆశించానని చెప్పాడు. ఇప్పుడు నేను సెలక్ట్ చేయబోతున్నానని, జీవితం అంటే ఇదేనని అభిప్రాయపడ్డాడు. ఒకటి లేదా రెండేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నాడు.
నేను క్యాబ్ అధ్యక్షుడిని అవుతానని ఎవరూ అనుకోలేదని, అలాగే కోచ్ ఇంటర్వ్యూకి వెళ్లవచ్చునని అభిప్రాయపడ్డాడు. నిన్న అందరూ నిద్రిస్తున్న సమయంలో (రాత్రి) తనకు నిద్ర పట్టలేదని, ఆ సమయంలో తాను లార్డ్లో చేసిన సెంచరీ వీడియోను చూశానని ఆ తర్వాత నిద్రపట్టిందన్నాడు.