బర్మింగ్హామ్: ఆశకు కూడా ఓ హద్దు అనేది ఉండాలని అంటుంటారు పెద్దలు. ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ అలిస్టర్ కుక్ తాజాగా చేసిన కామెంట్స్ చూస్తోంటే.. అత్యాశకు పోతోందనే అనుకోవాల్సి వస్తోంది. ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో ఆదివారం ఆరంభమైన మ్యాచ్లో ఇంగ్లండ్ టీమ్ భారత జట్టుపై 400కు పైగా స్కోరు సాధిస్తుందని కుక్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమ్ మంచి కాక మీద ఉందని అన్నాడు. వరుసగా రెండు మ్యాచులను కోల్పోవడం వల్ల ప్రజలు, అభిమానుల ఆగ్రహాన్ని చవి చూసిందని, దీనితో ఇవాన్ మోర్గాన్ టీమ్ కసితో రగిలిపోతోందని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ ఆరంభానికి ముందు- అలిస్టర్ కుక్ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లండ్ టీమ్ చెలరేగిపోయి ఆడటానికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నాడు. కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ బౌలింగ్ను అధ్యయనం చేసిందని, దీనికి అనుగుణంగా నెట్ ప్రాక్టీస్లో తీవ్రంగా కసరత్తు చేసిందని చెప్పాడు. టీమిండియాపై 400లకు పైగా స్కోరు చేసినా తనకు ఆశ్చర్యపోనక్కర్లేదని అలిస్టర్ కుక్ అన్నాడు. ఇప్పటిదాకా వరుసగా రెండు మ్యాచ్లను ఆడిన ఇంగ్లండ్ జట్టు.. ఇక వరుసగా నాలుగింట్లో తిరుగులేని విజయాలను నమోదు చేస్తుందని, ప్రపంచకప్ను ఎగరేసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
శ్రీలంక జట్టుతో ఓడిపోయినందున దాని ప్రభావం ఇంగ్లండ్ జట్టుపై విపరీతంగా పడిందని, ఫలితంగా- ఆత్మవిశ్వాసాన్ని కోల్సోయిందని చెప్పాడు. ఆత్మవిశ్వాసం కొరవడటంతోనే ఆస్ట్రేలియాతో జరిగని మ్యాచ్లో పరాజయాన్ని చవి చూసిందని కుక్ అన్నాడు. ఇప్పుడలాంటి పరిస్థితి లేదని చెప్పాడు. ఇంగ్లండ్ వరుసగా రెండు మ్యాచ్లను గెలుచుకుంటే ఇక- సెమీ ఫైనల్, ఫైనల్లో విజయాన్ని సాధించడం ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు పెద్ద కష్టమైన పనేమీ కాదని విశ్లేషించాడు. లీడ్స్లోని హెడింగ్లే స్టేడియంలో స్లో వికెట్ ప్రభావం వల్లే ఇంగ్లండ్ జట్టు శ్రీలంక విధించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందని పేర్కొన్నాడు.
{headtohead_cricket_3_2}