
జోహన్స్బర్గ్: త్వరలో టీమిండియా చేతిలో ఓడిపోతే ప్రపంచమేమీ అంతం కాదు అని దక్షిణాఫ్రికా జట్టు తాత్కాలిక డైరెక్టర్ ఎనోచ్ కేవీ పేర్కొన్నారు. భారత్లో రాణించడమే ప్రస్తుతం తమ ముందున్న ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేసారు. భారత్కు గట్టిపోటీ ఇవ్వడంపైనే తమ దృష్టి పెట్టాం, అందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఎనోచ్ అన్నారు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎనోచ్ను కొత్తగా నియమించింది. ఈ సందర్భంగా మీడియాతో ఎనోచ్ మాట్లాడాడు.
ఉపఖండంలో దక్షిణాఫ్రికాకు మంచి రికార్డు లేకపోవడం, ఇక భారత్లో టీమిండియా చేతిలో పేలవమైన రికార్డు ఉండటంపై ఎనోచ్ స్పందించారు. 'భారత పర్యటన పెద్ద సవాల్. మా ప్రభావాన్ని చూపగలమని నేను గట్టిగా నమ్ముతున్నా. అలా జరగకపోతే ప్రపంచమేమీ అంతం కాదు. ప్రతిదాంట్లో ఏదో ఒక అవకాశం ఉంటుంది. ప్రతి సవాలు ఒక అవకాశంగా తీసుకుంటా. కొద్దిపాటి సమయంలో మేము ఎంతవరకూ విజయవంతం అవుతామనేది తెలియదు. మాకు మంచి ఆటగాళ్ళు ఉన్నారు. భారత పర్యటనపై నేను పూర్తి బాధ్యత తీసుకుంటా' అని ఎనోచ్ తెలిపారు.
ఎనోచ్ దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్, సెలక్టర్, టీమ్ మేనేజర్గా వ్యవరించనున్నారు. సహాయ సిబ్బంది మొత్తం ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తారు. ఫుట్బాల్ లీగుల్లో మేనేజర్ల పదవి స్ఫూర్తిగా తీసుకొని దక్షిణాఫ్రికా బోర్డు ఎనోచ్ను నియమించింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్లో బార్సిలోనా మేనేజర్ గార్డియోలా తరహాలో ఎనోచ్ పనిచేస్తారు. దక్షిణాఫ్రికా జట్టు సెప్టెంబర్లో భారత్లో పర్యటించనుంది. మూడు టీ20 సిరీస్లో భాగంగా సెప్టెంబర్ 15న ధర్మశాలలో తొలి టీ20 ప్రారంభం కానుంది. మొహాలీ, బెంగళూరులో మిగతా టీ20లు జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 2 నుండి మూడు టెస్టుల సిరీస్ జరుగనుంది.