మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో యాషెస్ టెస్టులో ఇంగ్లాండ్ సంచలన విజయం సాధించింది. 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా విధించిన 175 పరుగుల లక్ష్యాన్ని కేవలం 32.2 ఓవర్లలోనే ఛేదించి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయం ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఓ టెస్ట్ మ్యాచ్ గెలవడానికి ఇంగ్లాండ్కు ఏకంగా 15 ఏళ్లు(5,468 రోజులు) పట్టింది.
అప్పుడు.. ఇప్పుడు!
ఇంగ్లాండ్ చివరిసారిగా ఆస్ట్రేలియాలో 2010-11 సిరీస్లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అప్పట్లో సచిన్ టెండూల్కర్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అప్పటికీ టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. నేడు టీమిండియా యూత్ కెప్టెన్గా ఎంపికైన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అప్పటికి ఇంకా పుట్టనే లేదు. ఆస్ట్రేలియాలో 18 టెస్టుల ఓటమి తర్వాత ఇంగ్లాండ్ మళ్లీ ఇప్పుడు విజయాన్ని రుచి చూసింది.

'బేజ్బాల్' విధ్వంసం
తొలి ఇన్నింగ్స్లో కేవలం 110 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్లో తమ ఆటతీరుతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్లు బెన్ డకెట్ (34), జాక్ క్రావ్లీ (37) కేవలం 42 బంతుల్లోనే 51 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. యువ ఆటగాడు జాక్ బెథెల్ (40) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో హ్యారీ బ్రూక్ (18*) సంయమనంతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.
స్టోక్స్, కార్సే ధాటికి ఆసీస్ విలవిల
అంతకుముందు, రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. బ్రైడన్ కార్సే (4 వికెట్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ (3 వికెట్లు) ధాటికి కంగారూలు కేవలం 132 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ట్రావిస్ హెడ్ (46) మినహా మిగిలిన వారెవరూ కనీస పోరాటాన్ని కనబర్చలేకపోయారు.
రెండు రోజుల్లోనే ముగిసిన టెస్ట్.. పిచ్పై చర్చ!
ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం విశేషం. మొత్తం 36 వికెట్లు కేవలం 48 గంటల్లోనే పడిపోయాయి. మెల్బోర్న్ పిచ్ బౌలింగ్కు ఎక్కువగా సహకరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. టెస్ట్ చరిత్రలో ఒకే సిరీస్లో రెండు మ్యాచ్లు రెండు రోజుల్లోనే ముగియడం ఇది కేవలం ఐదోసారి మాత్రమే. ప్రస్తుతం ఆస్ట్రేలియా 3-1తో సిరీస్లో ముందంజలో ఉన్నప్పటికీ.. ఈ విజయం ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సిడ్నీలో జరగనున్న చివరి టెస్టుకు ముందు ఇంగ్లాండ్ తన పరువును కాపాడుకోవడమే కాకుండా, ఆసీస్ గడ్డపై తమ పట్టును చాటుకుంది.