హైదరాబాద్: మహిళల క్రికెట్లో 50 ఓవర్లు అనవసరమని, 30 ఓవర్లకు తగ్గిస్తే బాగుంటుందని ఐసీసీకి సలహా ఇచ్చిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్పై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వకార్ వ్యాఖ్యలు మహిళా క్రికెటర్లను అవమాన పరిచే విధంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది.
ట్విట్టర్లో వకార్ ఏమని ట్వీట్ చేశాడంటే!
మహిళల వన్డే క్రికెట్లో 50 ఓవర్లు అనవసరం. దానిని 30 ఓవర్లకు తగ్గిస్తే బాగుటుంది. తక్కువ ఓవర్లు ఉంటే బౌలర్లు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తారు. టెన్నిస్లో పురుషులకు ఐదు సెట్లు ఉంటే మహిళలకు మూడు సెట్లే ఉంటాయి. దాన్ని పరిగణలోకి తీసుకుని మహిళల వన్డే ఓవర్లను 30 కి తగ్గించండి' అని ఐసీసీకి వకార్ యూనిస్ ట్వీట్ చేశాడు.
అయితే, ఏ ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేశాడో ట్విట్టర్లో ఆయన వివరించలేదు. దీంతో వకార్ వ్యాఖ్యలపై ఆయన అభిమానులు సైతం విమర్శలు గుప్పించారు. తన వ్యాఖ్యల ద్వారా మహిళల పట్ల వివక్ష చూపారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, చివరకు ఆయన సంజాయషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదంటూ మరో ట్వీట్ చేశారు. తక్కువ ఓవర్లుంటే వేగంతో పాటు ఆడియెన్స్ కూడా పెరుగుతాయని, కాంపటీటివ్ క్రికెట్గా కూడా మంచి పేరు వస్తుందన్నదే తన సూచన వెనుక ఉన్న ఉద్దేశమని వకార్ వివరణ ఇచ్చాడు. మహిళల పట్ల తనకు చిన్నచూపు లేదని కూడా అన్నాడు.
అయితే తాజాగా బుధవారం ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి ఆరొందలకు పైగా పరుగులు చేశారు. ఈ క్రమంలో వకార్ యూనిస్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటంగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యంతో లక్ష్య చేధనకు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లు పాటు ఆడి 9 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఉమెన్లలో సారా టేలర్ (147), టామీ బీమౌంట్ (148) సెంచరీలతో చెలరేగారు.
ఇక దక్షిణాఫ్రికా బ్యాట్స్ ఉమెన్లలో వోల్వార్ట్ (67), లిజెల్ లీ (72)తోపాటు ట్రైయాన్ (54) రాణించారు. దీంతో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠతను రేపింది. మహిళా క్రికెటర్లు సెంచరీలతో అదరగొట్టడంతో వకార్ ఇప్పుడు ఏమంటావ్! అని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.