
ఉమెన్స్ వరల్డ్కప్లో వెస్టిండీస్ జోరు కొనసాగుతుంది. వరుసగా మరో థ్రిల్లింగ్ మ్యాచ్లో విండీస్ మహిళలు జయభేరి మోగించారు. అది కూడా ఈ సారి పటిష్ట జట్టు ఇంగ్లండ్ను ఓడించడం గమనార్హం. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఉమెన్స్ టీంను వెస్టిండీస్ ఉమెన్స్ టీం 7 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన వెస్టిండీస్ మహిళలు వరల్డ్కప్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కాంప్బెల్లే 66 పరుగులతో సత్తా చాటింది. చెడియన్ నేషన్ 49 పరుగులతో అజేయంగా నిలవగా.. హేలీ మాథ్యూస్ 45, డాటిన్ 31 పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లెస్టోన్ 3, స్కివర్ ఒక వికెట్ తీశారు.
అనంతరం 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఉమెన్స్ టీం 47.4 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. దీంతో వెస్టిండీస్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓ దశలో ఇంగ్లండ్ 156 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇంగ్లీష్ జట్టును సోఫీ ఎక్లెస్టోన్ (33*), కేట్ క్రాస్ (27) ఆదుకున్నారు. వీరిద్దరు తొమ్మిదో వికెట్కు 61 పరుగుల జోడించారు. ఇంగ్లండ్ విజయం ఖాయమనుకున్న సమయంలో జట్టు స్కోర్ 217 పరుగుల వద్ద ఉండగా 27 పరుగులు చేసి కేట్ క్రాస్ రనౌటైంది. ఆ తర్వాత అన్య ష్రూబ్సోల్ను అదే ఓవర్లో మహమ్మద్ డకౌట్ చేయడంతో ఇంగ్లండ్ పోరాటం ముగిసింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో టామీ బ్యూమాంట్ 46, డేనియల్ వ్యాట్ 33, సోఫియా డంక్లీ 38 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో షామిలియా కన్నెల్ 3,హేలీ మాథ్యూస్, అనిసా మహమ్మద్ రెండేసి వికెట్లు తీశారు. ఆలియా అలీనే, టేలర్ తలో వికెట్ తీశారు. 66 పరుగులు చేసిన విండీస్ బ్యాటర్ షెమైన్ కాంప్బెల్లే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది.