మహిళల టీ20 ప్రపంచకప్ -2024లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా దుమ్మురేపింది. బుధవారం శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో 82 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగుల స్కోరు చేసింది. స్మృతి మంధాన(50; 38 బంతుల్లో, 4 ఫోర్లు, సిక్సర్), హర్మన్ప్రీత్ కౌర్ (52 నాటౌట్; 27 బంతుల్లో, 8 ఫోర్లు, సిక్సర్) అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు.
షెఫాలీ వర్మ(43; 40 బంతుల్లో, 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, అమా కాంచనా తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. కవిషా దిల్హరి(21), అనుష్క సంజీవణి(20) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, ఆశా శోభన చెరో మూడు వికెట్లు, రేణుక ఠాకూర్ రెండు వికెట్లు తీశారు.

కాగా, ఈ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో పరుగుల పరంగా భారత్కు ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2014లో బంగ్లాదేశ్పై 79 పరుగులు సాధించిన విజయం అతిపెద్దదిగా ఉండేది. అయితే ఈ మ్యాచ్లో తొలి వికెట్ 98 పరుగులు జోడించిన భారత ఓపెనర్లు స్మృతి మంధాన-షెఫాలీ వర్మ అరుదైన ఘనతలు సాధించారు.
మహిళల టీ20 క్రికెట్లో ఓ ఏడాదిలో ఏ వికెట్కు అయినా అత్యధికసార్లు 50+ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా స్మృతి మంధాన-షెఫాలీ వర్మ చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది టీ20ల్లో ఈ జంట ఏడు సార్లు అర్ధశతక భాగస్వామ్యాలు నమోదుచేశారు. ఈ జాబితాలో రెండో స్థానంలో సుజీ బేట్స్-సోఫీ డివైన్ (న్యూజిలాండ్-2018), అలీసా హీలీ- మూనీ (ఆస్ట్రేలియా- 2018), తజ్మిన్ బ్రిట్స్- లారా వోల్వర్డాట్ (దక్షిణాఫ్రికా-2023), కవిశ-ఇషా (యూఏఈ- 2023) ఉన్నారు. వాళ్లంతా ఓ ఏడాదిలో ఆరు సార్లు 50+ భాగస్వామ్యాల్ని నెలకొల్పారు.
మహిళల టీ20 క్రికెట్లో ఓ ఏడాదిలో అత్యధిక పరుగులు నెలకొల్పిన జోడీగానూ స్మృతి మంధాన- షెఫాలీ వర్మ రికార్డు సాధించింది. ఈ ఏడాది స్మృతి-షెఫాలీ 825 పరుగులు కలిసి సాధించారు.