మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ మరో కీలక సమరానికి సిద్ధమైంది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో ఇవాళ తలపడనుంది. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా ఆ తర్వాత పాకిస్థాన్పై ఘన విజయం సాధించి సెమీస్ రేసుకు తిరిగొచ్చింది. మరోవైపు ఆసియా ఛాంపియన్ శ్రీలంక వరుసగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూసింది.
సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇవాళ మ్యాచ్లో భారత్ తప్పక విజయం సాధించాలి. ఇరు జట్లు ఇప్పటివరకు 25 టీ20లు ఆడాయి. అందులో భారత్ 19 మ్యాచ్ల్లో గెలవగా, లంక అయిదు విజయాలు సాధించింది. ఓ మ్యాచ్ రద్దయింది. ఇక టీ20 వరల్డ్ కప్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు సార్లు భారత్ గెలవగా, ఓ మ్యాచ్ శ్రీలంక నెగ్గింది.

అయితే భారత్ సెమీస్కు చేరాలంటే ఇవాళ మ్యాచ్లో కేవలం గెలిస్తే సరిపోదు. ఘన విజయం సాధించాల్సి ఉంది. అప్పుడే నెట్రన్రేటును మెరుగుపర్చుకుంటుంది. ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడంతో టీమిండియా సెమీస్ సమీకరణాలు మారిపోయాయి. ఆస్ట్రేలియా 4 పాయింట్లు, +2.524 నెట్రన్రేటుతో గ్రూప్-ఏలో టేబుల్ టాప్లో ఉంది.
తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్ (2 పాయింట్లు, +0.555), న్యూజిలాండ్ (2 పాయింట్లు, -0.05), భారత్ (2 పాయింట్లు, -1.217) ఉన్నాయి. పాయింట్ల ఖాతా తెరవని శ్రీలంక -1.667 నెట్రన్రేటుతో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ మ్యాచ్లో శ్రీలంకపై భారీ విజయం సాధించి భారత్ నెట్రన్రేటును పాజిటివ్గా మార్చుకోవాలి. అంతేగాక ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై నెగ్గాలి. అప్పుడే అంతిమంగా టేబుల్ టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేటి మ్యాచ్లో లంక చేతిలో భారత్ ఓటమిపాలైతే టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే!