మహిళల టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా సెమీఫైనల్స్ అవకాశాలపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. మెగా టోర్నీలో ఫేవరేటు జట్టుగా బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసి అవకాశాల్ని దెబ్బతీసుకుంది. 58 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలై -2.900 నెట్ రన్రేటును మూటగట్టుకుంది.
ఆ తర్వాత పాకిస్థాన్పై విజయం సాధించినప్పటికీ నెట్ రన్రేటును -1.217తోనే ముగించింది. రెండు పాయింట్లతో గ్రూప్-ఏలో టీమిండియా నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో సెమీఫైనల్స్కు చేరాలంటే మిగిలిన మ్యాచ్ల్లో తప్పక విజయం సాధించి, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం న్యూజిలాండ్ (2 పాయింట్లు, +2.900), ఆస్ట్రేలియా (2 పాయింట్లు, +1.908), పాకిస్థాన్ (2 పాయింట్లు, +0.555) భారత్ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి.

పాయింట్ల ఖాతా తెరవని శ్రీలంక (-1.667) ఆఖరి స్థానంలో ఉంది. అయితే గ్రూప్-ఏలో ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. షార్జా వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం భారత్ సెమీస్ అవకాశాలను నిర్ణయిస్తుంది. ఈ పోరులో న్యూజిలాండ్ గెలిస్తే నెట్రన్రేటుపై ఆధారపడకుండా టీమిండియా సెమీఫైనల్స్కు చేరుకోవచ్చు. అయితే ఈ ఫలితంతో పాటు మరికొన్ని మ్యాచ్ ఫలితాలు ఈ విధంగా జరగాల్సి ఉంటుంది.
ఇవాళ ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ విజయం సాధించాలి. అంతేగాక అక్టోబర్ 14న పాకిస్థాన్తో జరగనున్న మ్యాచ్లో కూడా కివీస్ నెగ్గాలి. అప్పుడు భారత్కు సెమీస్ రూట్ క్లియర్ అవుతుంది. అయితే భారత్ తమ మిగిలిన మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, శ్రీలంక తప్పక విజయం సాధించాలి. ఆ సందర్భంలో న్యూజిలాండ్ ఎనిమిది పాయింట్లతో సెమీస్కు చేరుతుంది.
భారత్ మూడు విజయాలు, ఆరు పాయింట్లతో రెండో స్థానంలో సెమీస్కు వెళ్తుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ చెరో నాలుగు పాయింట్లు మాత్రమే సాధించి మూడు, నాలుగు స్థానాలకే పరిమితం అవుతుంది. ఇవాళ న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా భారత్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. అప్పుడు పాయింట్లతో పాటు నెట్రన్రేటుపై ఆధారపడాల్సి ఉంటుంది. నెగిటివ్లో ఉన్న భారత్ పాజిటివ్ ఎన్ఆర్ఆర్లోకి రావాలంటే ఆసీస్, లంకపై భారీ విజయాలు సాధించాలి.