మహిళల టీ20 ప్రపంచకప్ -2024లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా దుమ్మురేపింది. బుధవారం శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో 82 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. నెట్రన్రేటును గణనీయంగా మెరుగుపర్చుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా (4 పాయింట్లు, +2.524), భారత్ (4 పాయింట్లు, +0.576) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
పాకిస్థాన్ (2 పాయింట్లు, +0.555), న్యూజిలాండ్ (2 పాయింట్లు, -0.050) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల ఖాతా తెరవని శ్రీలంక (-2.564) పట్టికలో అట్టడుగన నిలిచింది. గ్రూప్లో ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే గ్రూప్-ఏ సెమీస్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. అన్ని జట్లలో ఆస్ట్రేలియాకు మెరుగైన అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా మిగిలిన తమ రెండు మ్యాచ్ల్లో (పాకిస్థాన్, భారత్)పై విజయం సాధిస్తే అజేయంగా సెమీస్కు దూసుకెళ్తుంది. ఒకవేళ భారత్ చేతిలో ఓడి, పాకిస్థాన్పై గెలిచినా; న్యూజిలాండ్ తమ మిగిలిన మ్యాచ్ల్లో ఒక్కదాంట్లో ఓడితే.. నెట్రన్రేటుతో సంబంధం లేకుండా ఆసీస్ సెమీఫైనల్స్కు చేరుకుంటుంది. కివీస్ విజయాలతో సంబంధం లేకుండా కూడా మెరుగైన నెట్రన్రేటుతో కంగారూలు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది.
అయితే ఇక పోటీ అంతా రెండో స్థానం గురించే. సెమీస్ రేసులో భారత్కు పోటీగా న్యూజిలాండ్ ఉంది. పాకిస్థాన్కు కూడా ఛాన్స్ ఉన్నప్పటికీ.. ఆ జట్టు బలమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పోటీపడాల్సి ఉంది. దీంతో అసలైన పోటీ భారత్ X కివీస్ మధ్యనే. కాగా, ఆస్ట్రేలియాపై భారత్ తప్పక విజయం సాధించాలి. ఆసీస్పై టీమిండియా గెలిచి, పాకిస్థాన్పై ఆస్ట్రేలియా నెగ్గి, మరోవైపు న్యూజిలాండ్ తమ మిగిలిన మ్యాచ్ల్లో శ్రీలంక, పాకిస్థాన్పై గెలిస్తే... భారత్, ఆసీస్, కివీస్ ఆరు పాయింట్లతో నిలుస్తాయి.
ఆ సందర్భంలో మెరుగైన నెట్రన్రేటు ఉన్న జట్లు సెమీస్కు వెళ్తాయి. అయితే భారత్ సేఫ్గా సెమీఫైనల్స్కు వెళ్లాలంటే.. ఆస్ట్రేలియాపై ఈ తరహాలో నెగ్గాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఆస్ట్రేలియాపై భారత్ ఒక్క పరుగుతో నెగ్గితే.. శ్రీలంక, పాకిస్థాన్పై సంయుక్తంగా (రెండు మ్యాచ్ల్లో కలిపి) న్యూజిలాండ్ 38 పరుగుల కంటే తక్కువ తేడాతోనే కివీస్ నెగ్గాలి. ఒకవేళ 10 పరుగుల తేడాతో టీమిండియా గెలిస్తే.. న్యూజిలాండ్ 48 పరుగులకు తక్కువగానే గెలవాలి. అప్పుడే భారత్ నెట్రన్రేటును న్యూజిలాండ్ అధిగమించలేదు.
ఆస్ట్రేలియా చేతిలో ఓడితే?
ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైనా భారత్ సెమీస్కు చేరే అవకాశం ఉంటుంది. అయితే న్యూజిలాండ్, పాకిస్థాన్ కనీసం తమ మిగిలిన మ్యాచ్ల్లో ఒక్క పోరులో ఓటమిపాలవ్వాలి. అంతేగాక ఆసీస్ చేతిలో భారత్ స్వల్ప తేడాతోనే ఓడాలి. ఆ స్థితిలో నెట్రన్రేటు ఆధారంగా టీమిండియాకు సెమీస్ ఛాన్స్లు ఉంటాయి.