మహిళల టీ20 ప్రపంచకప్ -2024లో షార్జా వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. సెమీఫైనల్ బెర్తు రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత బౌలర్లు అంచనాల మేరకు రాణించలేకపోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. షార్జా పిచ్పై ఇది కఠినమైన లక్ష్యమే.
గ్రేస్ హారిస్ (40; 41 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. స్టాండ్బై కెప్టెన్ తాహిలా మెక్గ్రాత్ (32; 26 బంతుల్లో, 4 ఫోర్లు), ఎలీసా పెర్రీ (32; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రేణుక సింగ్, దీప్తి శర్మ రెండు వికెట్లు, శ్రేయాంక, పూజ వస్త్రాకర్, రాధ యాదవ్ తలో వికెట్ తీశారు. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో భారత బౌలర్లు పైచేయి సాధించారు. 17 పరుగులకే రెండు వికెట్లు తీశారు.

కానీ అదే జోరును కొనసాగించలేకపోయారు. తాహిలాతో కలిసి గ్రేస్ ఇన్నింగ్స్ చక్కదిద్దింది. మూడో వికెట్కు వీరిద్దరు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఓ దశలో ఆసీస్ 79/2తో మెరుగైన స్థితిలో ఉంది. భారత బౌలర్లు గొప్పగా పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ స్కోరుబోర్డు కట్టడిచేశారు. కాగా, ఈ ఆస్ట్రేలియా నెట్రన్ రేటును భారత్ అధిగమించాలంటే ఛేదనలో 10.2 ఓవర్లలోపే 152 పరుగుల లక్ష్యాన్ని సాధించాలి.
ఒకవేళ ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైనా.. న్యూజిలాండ్ నెట్ రన్ రేటు కంటే మెరుగ్గా ఉండాలంటే కనీసం 139 పరుగులు లేదా అంత కంటే ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా (4 పాయింట్లు, +2.524), భారత్ (4 పాయింట్లు, +0.576), న్యూజిలాండ్ (4 పాయింట్లు, +0.282), పాకిస్థాన్ (2 పాయింట్లు, -0.488), శ్రీలంక (-2.173) వరుస స్థానాల్లో ఉన్నాయి.