మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టు మహా సమరానికి సిద్దమైంది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో ఇవాళ తలపడనుంది. సెమీఫైనల్స్కు అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఇవాళ టీమిండియా తప్పక విజయం సాధించాలి. రికార్డుల పరంగా పాక్ అమ్మాయిలపై మనోళ్లదే పైచేయి. టీ20 ఫార్మాట్లో ఇరు జట్లు 15 సార్లు తలపడగా భారత్ 12 సార్లు నెగ్గింది. మూడింట్లో ఓటమిపాలైంది.
ఇక టీ20 వరల్డ్ కప్లో ఆరు సార్లు పోటీపడగా మన అమ్మాయిలు నాలుగు సార్లు విజయం సాధించి, రెండింట్లో పరాజయాన్ని చవిచూశారు. హర్మన్ప్రీత్ సేన ఫామ్ చూస్తే ఇవాళ మ్యాచ్లో విజయం ఖాయమే అనిపిస్తోంది. కానీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయం భారత అభిమానులను కలవరపెడుతోంది. తిరిగి పుంజుకుని పాకిస్థాన్పై పైచేయ సాధిస్తారా? లేదా ఒత్తిడికి లోనవుతారా అనే సందేహాలు ఫ్యాన్స్లో నెలకొన్నాయి.

న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడంతో భారత్... గ్రూప్-ఏ టేబుల్లో -2.900 నెట్ రన్రేటుతో అట్టడుగు స్థానంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో సెమీస్ రేసులో నిలవాలంటే హర్మన్ప్రీత్ సేనకు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. పాక్తో పాటు తదుపరి మ్యాచ్ల్లో శ్రీలంక, ఆస్ట్రేలియాపై గెలిచి మెరుగైన రన్రేట్ సాధిస్తే భారత్ సెమీస్కు చేరుతుంది.
అయితే ఒకవేళ ఇవాళ పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైతే టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. ఆ సందర్భంలో కచ్చితంగా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో టీమిండియా కచ్చితంగా మెరుగైన విజయం సాధించాలి. అంతేగాక ఓ జట్టు మినహా మిగిలిన ఏ జట్టూ రెండు కంటే ఎక్కువగా విజయాలు సాధించకూడదు. ఇప్పటికే కివీస్, ఆసీస్ చెరో విజయం సాధించింది. ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టు.. లీగ్ మ్యాచ్ల్లో అజేయంగా నిలవాలని భారత అభిమానులు కోరుకోవాలి. అప్పుడే మనకు అవకాశాలు మెరుగవుతాయి.