భారత్ సెమీస్ ఆశలు ఆవిరి అయ్యాయి. మహిళల టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. న్యూజిలాండ్పై పాకిస్థాన్ విజయం సాధిస్తే హర్మన్ప్రీత్ సేన సెమీఫైనల్స్కు చేరేది. కానీ కివీస్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. ఫలితంగా గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్లాయి. భారత్తో పాటు పాకిస్థాన్, శ్రీలంక ఇంటిముఖం పట్టాయి.
దుబాయ్ వేదికగా సోమవారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 110 పరుగులు చేసింది. ఓపెనర్ సుజీ బేట్స్ (28; 29 బంతుల్లో, 3 ఫోర్లు), బ్రూక్ హాలిడే (22; 24 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్లు. పాక్ బౌలర్లలో నష్రా సంధు మూడు వికెట్లు. ఒమైమా సోహైల్, నిదా దర్, సదియా ఇక్బాల్ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఫాతిమా సనా (21; 23 బంతుల్లో, 2 ఫోర్లు), వికెట్ కీపర్ మునీబా అలీ (15; 11 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో అమేలియా కేర్ మూడు వికెట్లు, ఎడెన్ కార్సెన్ రెండు వికెట్లు పడగొట్టారు.
ఛేదన ఆది నుంచే పాకిస్థాన్ ఓటమి బాటలో పయనించింది. 28 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఫాతిమా.. మునీబాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కానీ కివీస్ బౌలర్ల ముందు ఎక్కువసేను వాళ్లు నిలవలేకపోయారు. పాకిస్థాన్ నాలుగు పరుగుల వ్యవధిలో చివరి అయిదు వికెట్లు కోల్పోవడం గమనార్హం.