సెమీఫైనల్స్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. మహిళల టీ20 ప్రపంచకప్ -2024లో భాగంగా షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్లో 9 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. హర్మన్ప్రీత్ కౌర్ (54 నాటౌట్; 47 బంతుల్లో, 6 ఫోర్లు) పోరాడింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 151 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (40; 41 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. స్టాండ్బై కెప్టెన్ తాహిలా మెక్గ్రాత్ (32; 26 బంతుల్లో, 4 ఫోర్లు), ఎలీసా పెర్రీ (32; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రేణుక సింగ్, దీప్తి శర్మ రెండు వికెట్లు, శ్రేయాంక, పూజ వస్త్రాకర్, రాధ యాదవ్ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ షెఫాలీ వర్మ (20; 13 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయింది. దీప్తి శర్మ (29; 25 బంతుల్లో, 3 ఫోర్లు) పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్, సోఫీ మోలనూ తలో రెండు వికెట్లు తీశారు.
అయితే భారత్ సెమీస్ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించలేదు. ఇవాళ జరగనున్న పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై టీమిండియా సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. న్యూజిలాండ్పై పాక్ గెలిస్తే భారత్ సెమీస్కు చేరుకుంటుంది. అయితే పాకిస్థాన్కు సెమీస్కు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు పాక్ మొదట 150 పరుగులు సాధిస్తే.. కనీసం 53 పరుగుల తేడాతో గెలవాలి. అలాగే న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 150 పరుగులు చేస్తే.. 9.1 ఓవర్లలోపు పాక్ ఛేదించాలి. అప్పుడే ఆస్ట్రేలియాతో పాటు పాకిస్థాన్ సెమీస్కు చేరుతుంది. ఒకవేళ పాక్ ఓటమిపాలైతే, ఆసీస్తో కివీస్ సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తుంది.