టీ20 వరల్డ్ కప్తో స్వదేశానికి తిరిగొస్తామని భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరనున్న విషయం తెలిసిందే. పొట్టి కప్ మిషన్ కోసం మన అమ్మాయిలు ఇవాళ బయలుదేరారు.అయితే ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న హర్మన్ప్రీత్ కీలక వ్యాఖ్యలు చేసింది.
గత పొరపాట్లను సరిదిద్దుకొని విజేతగా తిరిగొస్తామని హర్మన్ప్రీత్ తెలిపింది. మెగాటోర్నీ కోసం కఠోర సాధన చేశామని, ఫీల్డింగ్, ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పింది. అత్యుత్తమ జట్టుతో టీ20 కప్ వేటకు వెళ్తున్నామని పేర్కొంది. గతంలో సెమీస్లో ఓడిపోయామని, గత టోర్నీల కంటే ఈసారి మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యామని వెల్లడించింది. ఏ జట్టును అయినా ఓడించగలమని, ఈ విషయం ఆస్ట్రేలియాకు కూడా తెలుసని హర్మన్ప్రీత్ తెలిపింది.

మహిళల టీ20 ప్రపంచకప్లలో భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్కు చేరింది. 2020 మెగాటోర్నీలో టైటిల్ పోరుకు చేరుకున్నప్పటికీ కప్ను అందుకోలేకపోయింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. కాగా, గత జులైలో ఆసియా కప్లో రన్నరప్గా నిలిచిన తర్వాత భారత జట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు.అయితే బెంగళూరులోని ఎన్సీఏలో సుదీర్ఘ సన్నాహక శిబిరంలో పాల్గొంది.
కాగా, అక్టోబర్ 3 నుంచి 20 వరకు మహిళల టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అయితే అంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ మెగాటోర్నీ బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సి ఉంది.కానీ అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పొట్టి కప్ను యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రపంచకప్లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. అయిదు జట్లు రెండు గ్రూప్లు విడిపోయి సెమీఫైనల్స్ బెర్తు కోసం పడనున్నాయి.
గ్రూప్-ఏలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. మరోవైపు గ్రూప్-బీలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. అక్టోబర్ 4 నుంచి భారత్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఉంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమిండియా అమీతుమి తేల్చుకోనుంది. అలాగే అక్టోబర్ 9న శ్రీలంక, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 17, 18న సెమీఫైనల్స్, అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది.