వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్ కప్నకు 18 ఏళ్లలోపు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. మహిళల క్రికెట్కు మరింత ఆదరణ తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మెగాటోర్నీలో మ్యాచ్లకు కనీస టికెట్ ధర అయిదు దిర్హమ్స్ అని తెలిపింది. భారత కరెన్సీలో దీని విలువ 115 రూపాయలు.
ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన మహిళల టీ20 ఆసియా కప్నకు స్టేడియంలో ప్రజలందరికీ ఫ్రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, అక్టోబర్ 3 నుంచి 20 వరకు మహిళల టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అయితే అంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ మెగాటోర్నీ బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సి ఉంది.కానీ అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పొట్టి కప్ను యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు.

ఈ ప్రపంచకప్లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. అయిదు జట్లు రెండు గ్రూప్లు విడిపోయి సెమీఫైనల్స్ బెర్తు కోసం పడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. మరోవైపు గ్రూప్-బీలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. అక్టోబర్ 4 నుంచి భారత్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఉంది.
అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమిండియా అమీతుమి తేల్చుకోనుంది. అలాగే అక్టోబర్ 9న శ్రీలంక, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 17, 18న సెమీఫైనల్స్, అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది. ఈ మెగాటోర్నీ కోసం భారత మహిళల జట్టు ప్రస్తుతం ఎన్సీఏలో సన్నద్ధమవుతోంది. ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ పర్యవేక్షణలో నైపుణ్య శిబిరంలో ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. గ్రూప్ దశ మ్యాచ్ల కంటే ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 29న వెస్టిండీస్తో, అక్టోబర్ 1న సౌతాఫ్రికాతో తలపడనుంది.
మహిళల టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన భారత జట్టు:
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ ఠాకూర్, హేమలత, ఆశ శోభన, రాధా యాదవ్, శ్రేయాంక్ పాటిల్, సజన.
రిజర్వ్ ప్లేయర్లు: ఉమ ఛెత్రి (వికెట్ కీపర్), తనుజ, సైమా
నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: రఘ్వీ బిస్త్, ప్రియ మిశ్రా.